టీ20 సిరీస్ను 1-1తో సమం చేసిన భారత్ వన్డే సిరీస్లో చెలరేగింది. నిర్ణయాత్మక మూడో వన్డేలో 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ (108; 114 బంతుల్లో), తిలక్ వర్మ (52; 77 బంతుల్లో), రింకూ సింగ్ (38; 27 బంతుల్లో) రాణించారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. అర్షదీప్ సింగ్ (4/30), వాషింగ్టన్ సుందర్ (2/38), అవేశ్ ఖాన్ (2/45) సత్తాచాటారు. సఫారీ జట్టు ఓపెనర్ టోనీ డిజోర్జి (81; 87 బంతుల్లో) పోరాడాడు.
మ్యాచ్ అనంతరం ఓటమి గురించి దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ మాట్లాడాడు. సిరీస్ అనుభవాలు, ఓటమి గల కారణాలు వివరించాడు. ''సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. మైదానం చాలా బాగుంది. మ్యాచ్ను వీక్షించడానికి ప్రేక్షకులు ఎంతో రావడం మంచి అనుభూతి ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు విజయం సాధించలేకపోయాం. జట్టులో అందరూ సత్తాచాటే ప్లేయర్లే ఉన్నారు. కానీ మాకు కలిసిరాలేదు''

''297 స్కోరును ఛేజింగ్ చేయొచ్చని భావించాం. కానీ పిచ్ మేం భావించినంత మారలేదు. బంతితో మెరుగ్గానే రాణించాం. కానీ ఈ మ్యాచ్లో టాస్ కీలకమని అనుకోవట్లేదు. ఇక టెస్టు సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. రెండు టెస్టులు గొప్ప మైదానాల్లో జరగనున్నాయి'' అని మార్క్రమ్ అన్నాడు. కాగా, టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. పార్ల్ మైదానంలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు మెరుగైన రికార్డు ఉన్నా మార్క్రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో పిచ్ స్వభావం మారుతుందనుకున్నాడు. కానీ అలా జరగలేదు.
కాగా, సౌతాఫ్రికా పర్యటనలో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. కేప్టౌన్లో చివరి టెస్టు జనవరి 03న మొదలవుతుంది. ఇరు జట్ల స్టార్ ప్లేయర్లు టెస్టు సిరీస్ కోసమే విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. వారి రీఎంట్రీతో టెస్టు సిరీస్ హొరాహోరీగా సాగడం ఖాయం.