సఫారీ గడ్డపై బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని తొలి టెస్టులోనే తేలిపోయింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లో 245, 131 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా చేతిలో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూసింది. కాగా, రేపటి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. కేప్ టౌన్లో జరగనున్న ఈ ఆఖరి టెస్టులో విజయం సాధిస్తేనే భారత్ సిరీస్ను 1-1తో సమం చేయగలుగుతుంది.
అయితే దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ అలన్ డొనాల్డ్.. సచిన్ టెండూల్కర్ను కొనియాడుతూ, టీమిండియాకు కొన్ని సూచనలు చేశాడు. సౌతాఫ్రికా పర్యటనకు అయిదు సార్లు వచ్చిన సచిన్ నాలుగు సెంచరీ సాధించాడు. ''దక్షిణాఫ్రికాలో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో పోలిస్తే పిచ్ను తాకిన తర్వాత బంతి గమనం భిన్నంగా ఉంటుంది. బ్యాట్స్మెన్ తమ ఫుట్ వర్క్పై పూర్తి ఏకాగ్రత పెట్టాలి. అలా చేయకపోతే ఇబ్బందుల్లో పడతారు''

''మాతో కలిసి ఆడిన సచిన్ టెండూల్కర్ సౌతాఫ్రికాలో గొప్పగా బ్యాటింగ్ చేశాడు. మిడిల్ స్టంప్ మీద ఎక్కువ సేపు లేకుండా సత్తాచాటాడు. బంతిని ఎదుర్కోవడంలో, వదిలేయడంలో అతడి కదలికలు అద్భుతంగా ఉంటాయి. ఇక రెండో టెస్టు జరగనున్న కేప్టౌన్ విషయానికొస్తే.. ఇది గొప్ప టెస్టు పిచ్. ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.''

''అలాగే సౌతాఫ్రికా టీమ్ తమ వాతావరణ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుంటుంది. ఓపికగా సరైన ప్రదేశాల్లో బంతిని సంధిస్తూ లాభపడుతుంది. గత టెస్టులో తొలి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్లో భారత్ కంటే ఎక్కువ షార్ట్ బంతులు విసిరింది '' అని డొనాల్డ్ అన్నాడు. కాగా, కేప్ టౌన్లో రేపటి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలని టీమిండియా కసిగా సాధన చేస్తోంది. అలాగే సిరీస్ను 1-1తో సమం చేసేలా ప్రణాళికలు రచిస్తోంది.