టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ గతేడాది ఓ కేటుగాడి చేతిలో మోసపోయిన విషయం తెలిసిందే. లగ్జరీ వస్తువులు విక్రయిస్తానంటూ మృణాంక్ సింగ్ అనే మాజీ క్రికెటర్.. పంత్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బును కాజేశాడు. కానీ పంత్ మోసాన్ని కనిపెట్టి ఫిర్యాదు చేయడంతో మ్యూచ్వల్ సెటిల్మెంట్తో రూ.1.63 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. కానీ చెక్ బౌన్స్ కారణంగా ఆ మొత్తం కూడా పంత్కు చేరలేదు. గతేడాది ఈ వార్త సంచలనంగా మారింది.
అయితే ఆ తర్వాత మరికొన్ని మోసాలకు పాల్పడి దేశాన్ని వీడుతున్న మృణాంక్ సింగ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఫేమస్ లగ్జరీ హోటల్లో బిల్లు కట్టకుండా తప్పించుకున్నందుకు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది మృణాంక్ ఓ వారం పాటు లగ్జరీ హోటల్లో ఉన్నాడు. కానీ రూ.5.53 లక్షల బిల్లును చెల్లించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన స్పాన్సర్ కంపెనీ చెల్లిస్తుందని మాయమాటలతో హోటల్ సిబ్బందిని బురిడీ కొట్టించాడు. రూ.2 లక్షలు బదిలీ చేసినట్లు నకిలీ లావాదేవీ వివరాలను చూపించాడు.

అయితే మోసపోయామని తెలుసుకున్న హోటల్ మేనేజ్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులు మృణాంక్పై కేసు నమోదు చేసి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 25న హాంకాంగ్కు వెళ్లేందుకు మృణాంక్ ఢిల్లీ ఎయిర్పోర్టుకు రావడంతో అరెస్టు చేశారు. అప్పుడు కూడా తాను సీనియర్ ఐపీఎస్ అధికారినంటూ ఇమిగ్రేషన్ అధికారుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
కాగా, 25 ఏళ్ల మృణాంక్ సింగ్ హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన వాడు. గతంలో ఆ రాష్ట్ర అండర్-19 జట్టుకు ఆడాడు. తర్వాత ఘరానా మోసాలు మొదలుపెట్టాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరపున ప్రాతినిథ్యం వహించా అంటూ ఎంతో మంది అమ్మాయిలను, అంతర్జాతీయ బ్రాండ్లను మోసం చేశాడు. అయితే మృణాంక్ సింగ్ ఫోన్ను పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఫోన్లో అమ్మాయిలతో అతడు అసభ్యకరంగా దిగిన ఫొటోలు ఉన్నాయి. అంతేగాక అతడు డ్రగ్స్ కూడా కొనుగోలు చేశాడని గుర్తించారు. చాలా రాష్ట్రాల్లో అతడిపై కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.