వన్డే వరల్డ్ కప్లో భారత్ రన్నరప్గా నిలిచింది. మెగాటోర్నీ ఆద్యంతం సత్తాచాటిన టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో తడబడింది. పుష్కరకాల కప్ కలను సాధిస్తామనుకుంటే మిస్ అయ్యింది. అయితే కప్ కోల్పోయిన బాధ నుంచి అంత ఈజీగా బయటపడలేకపోతున్నానని ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్న విషయం తెలిసిందే.
మరోవైపు ప్రపంచకప్ ఫైనల్ ఓటమి బాధ గురించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ ఓటమి కన్నీళ్లు ఆవిరైపోయాయని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగే సత్తా భారత క్రికెట్కు ఉందని అన్నాడు.

''ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో ఊహించని ఓటమి ఎదురైంది. ఓటమి బాధ కన్నీళ్లు ఆవిరైపోయాయి. ఎలాంటి పరిస్థితి నుంచి అయినా బయటపడి ముందుకు సాగే సత్తా భారత్ క్రికెట్కు ఉందని నిరూపించింది. టీమిండియా డైహార్ట్ క్రికెట్ ఫ్యాన్స్ మినహా మిగిలినవారెవరు ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు టీ20ల సిరీస్ గురించి పెద్దగా పట్టించుకోలేదు''
''ఎందుకంటే దాదాపు రెండు నెలల పాటు సాగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత టీ20 సిరీస్ చూడటానికి బలమైన కారణం ఏదీ లేదు. అంతేగాక ఇరు జట్లలోని కీలక ప్లేయర్లు సిరీస్కు దూరమవ్వడం మరో కారణం. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆటగాళ్ల బదిలీల గురించి అందరి దృష్టి మళ్లింది. ఏ ఆటగాళ్లు ఏ జట్టుకు బదిలీ అవుతారు? వేలంలో ఏ ప్లేయర్ ఏ జట్టుకు వెళ్తాడనే దానిపై భారత అభిమానులకు ఆసక్తి పెరిగింది'' అని సునీల్ గవాస్కర్ అన్నాడు. దుబాయ్ వేదికగా ఐపీఎల్ వేలం ఈ నెల 19న జరగనుంది.