జట్టు కూర్పే తలనొప్పి..
ప్రస్తుతం భారత జట్టు ముందున్న అతి పెద్ద సవాల్ జట్టు కూర్పేనని చోప్రా అన్నాడు. 'ఇప్పుడు జట్టులో శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ముగ్గురూ ఉన్నారు. వీరిలో ఓపెనర్లుగా ఎవరిని పంపించాలి? రోహిత్ లేని ప్రతి సిరీస్లో జట్టును ధవన్ ముందుండి నడిపించాడు. మంచి స్కోర్లు కూడా చేశాడు. ఈ ఏడాది అతని స్ట్రైక్ రేట్ పడిపోవడం నిజమే. దాన్ని మనం ఇటీవలే గుర్తించాం. కానీ అతను కూడా స్పెషలిస్టు ఓపెనరే కదా' అని చోప్రా చెప్పాడు.
నాలుగో నెంబర్ ఎవరిది?
అలాగే కోహ్లీ మూడో నెంబర్లో వస్తే నాలుగో స్థానంలో ఎవరు? అనేది కూడా సమస్యేనన్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్.. ఈ ముగ్గురిలో నాలుగో నెంబర్ ఆటగాడిని ఎంచుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. వీరిలో అయ్యర్ అద్భుతంగా రాణిస్తూ ముందంజలో ఉండగా.. వన్డేల్లో మిడిలార్డర్లో ఆడిన అనుభవం కేఎల్ రాహుల్ సొంతం. ఇక పంత్ విషయానికొస్తే అతను అత్యంత చెత్త ఫామ్లో కనిపిస్తున్నాడు.
పంత్ vs ఇషాన్ కిషన్
అదే సమయంలో చెత్త ఫామ్లో ఉన్న పంత్ను ఆడిస్తారా? లేక జట్టుతో ఉన్న ఇషాన్ కిషన్కు అవకాశం ఇస్తారా? అనేది కూడా చూడాలన్నాడు. లేదంటే కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ చేయగలడని గుర్తుచేశాడు. రాహుల్తో కీపింగ్ చేయించి, మరో బ్యాటర్ను తీసుకునే ఛాన్స్ కూడా ఉందని చెప్పాడు. అయితే జట్టు మాత్రం పంత్కే అవకాశం ఇచ్చే అవకాశాలు మరీ ఎక్కువగా ఉన్నాయన్నాడు.
టాప్-6 ఎవరంటే..
'నన్నడిగితే రోహిత్, ధవన్ ఓపెనర్లుగా రావాలి. ఎందుకంటే వీళ్లిద్దరూ లోయర్ ఆర్డర్లో రాలేరు. ఆ తర్వాత మూడో స్థానంలో కోహ్లీ, నాలుగులో రాహుల్, ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఆరో స్థానంలో రిషభ్ పంత్ వస్తారు. అప్పుడే జట్టు కూర్పు సరిపోతుంది' అని ఆకాష్ చోప్రా చెప్పాడు. ఇంకా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్లో లేరు. వాళ్లు కూడా వస్తే జట్టు కూర్పు మరింత పెద్ద సమస్యగా మారుతుందని, జట్టులోని ఆటగాళ్లు ఏమాత్రం గాడి తప్పినా తమ స్థానం కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.