స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటారా? లేదా యువకులకు అవకాశం ఇస్తారా? అనే ప్రశ్నలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ అనంతరం రోహిత్, కోహ్లి భవిష్యత్పై మరింత సందేహాలు పెరిగాయి. విశ్రాంతి, పనిభారం పేరుతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20ల సిరీస్కు వారిద్దరిని దూరం చేశారు. అంతేగాక గతేడాది నుంచి పొట్టి ఫార్మాట్లో వారి స్థానాల్లో యువకులే ఆడుతున్నారు.
అయితే జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీ కంటే ముందు భారత్ ఆడే ఆఖరి టీ20 సిరీస్ అఫ్గానిస్థాన్తోనే. జనవరి 11 నుంచి అఫ్గాన్తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సెలక్టర్లు తమ ప్రణాళికలు వేగవంతం చేశారు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో నేరుగా చర్చించడానికి సెలక్టర్లు ఏకంగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు.

చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో పాటు సెలక్టర్లు శివ్సుందర్ దాస్, సలీల్ అంకోలా భారత్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు జరగనున్న కేప్టౌన్కు ఇప్పటికే చేరుకున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకొని అఫ్గాన్ సిరీస్కు జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అలాగే ఆ సిరీస్కు కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై చర్చించనున్నారు. టీ20 ఫార్మాట్కు గత కొంత కాలంగా హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ప్రస్తుతం వారిద్దరు గాయపడి జట్టుకు దూరమయ్యారు.
అయితే టీ20 వరల్డ్ కప్ రోడ్ మ్యాప్లో రోహిత్ శర్మ ఉంటే అఫ్గాన్ సిరీస్తో పాటు టోర్నీ మొత్తానికి అతడికే పగ్గాలు అప్పగించే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. అలాగే మరో రెండు మూడు రోజుల్లో అఫ్గానిస్థాన్ సిరీస్కు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్లో దాదాపు 30 మంది ప్లేయర్ల ప్రదర్శనను సెలక్టర్లు పరిశీలించనున్నారు. వారిలో నుంచి షార్ట్ లిస్ట్ను ఎంపిక చేసి ప్రపంచకప్నకు సెలక్ట్ చేస్తారు.