భారత జట్టులో ఆస్ట్రేలియన్లా స్వభావం ఉండే క్రికెటర్ల గురించి ఆసీస్ ప్లేయర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆలోచనలు, యాక్షన్లో విరాట్ కోహ్లి ఓ ఆస్ట్రేలియన్ అని ఇటీవల స్టీవ్ స్మిత్ పేర్కొన్న విషయం తెలిసిందే. విరాట్ బరిలోకి దిగే విధానం, సవాళ్లను స్వీకరించే తీరు, ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి చేసే పోరాటం ఓ ఆస్ట్రేలియన్లా ఉంటుందని స్మిత్ అన్నాడు.
అయితే తాజాగా ఇతర ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. భారత జట్టులో అసలైన ఆస్ట్రేలియన్ రిషభ్ పంత్ అని ట్రావిస్ హెడ్ అన్నాడు. ''భారత జట్టులో అసలైన ఆస్ట్రేలియన్ రిషభ్ పంత్. అతని దూకుడు స్వభావం, పనితీరు అలానే ఉంటుంది. పంత్తో ఆడటం ఎంతో సరదాగా ఉంటుంది'' అని హెడ్ పేర్కొన్నాడు.

మిచెల్ మార్ష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చీల్చిచెండాడే బ్యాటింగ్ విధానం చూస్తే పంత్ ఆస్ట్రేలియన్ అయితే బాగుంటుందనిపిస్తుందని మార్ష్ అన్నాడు. గత కొన్నేళ్లుగా పంత్ అనేక సవాళ్లను ఎదుర్కొని గొప్పగా వాటి నుంచి తిరిగొచ్చాడని తెలిపాడు. పంత్ చాలా పాజిటివ్ వ్యక్తి అని, గెలవడాన్ని ఎంతో ఇష్టపడుతాడని, గట్టి పోటీనిస్తూ ఎప్పుడూ చిరునవ్వుతో సరదాగా ఉంటాడని మిచెల్ మార్ష్ పేర్కొన్నాడు.
అయితే భారత జట్టులో విరాట్ కోహ్లి ఆస్ట్రేలియన్లా అనిపిస్తాడని మిచెల్ స్టార్క్ అన్నాడు. కీలక మ్యాచ్ల్లో కోహ్లి ఆడే విధానం, మ్యాచ్ను అతడు తీసుకువెళ్లే విధానం, అర్థం చేసుకునే తీరు ఆస్ట్రేలియన్లా ఉంటుందని స్టార్ తెలిపాడు. ఇతరులతో పోటీ పడటాన్ని కోహ్లి ఇష్టపడతాడని, ఆస్ట్రేలియన్లు కూడా అలానే ఉంటారని స్టార్క్ వివరించాడు.
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. పెర్త్ వేదికగా తొలి టెస్టు నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.