
నాలుగు సార్లు ఐపీఎల్ విజేత, ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ సౌతాఫ్రికా టీ20లో జోహన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఫ్రాంచైజీకి ఎంఎస్ ధోనీని మెంటార్గా నియమించాలని సీఎస్కే భావిస్తోంది. అయితే బీసీసీఐ విదేశీ లీగ్లతో భారత ఆటగాళ్లు సంబంధం కలిగి ఉండకూడదని నిషేధాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ధోనీని మెంటార్గా నియమించాలనుకున్న సీఎస్కేకు బీసీసీఐ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఓ బీసీసీఐ అధికారి వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇతర విదేశీ లీగ్లలో ఆడాలంటే బీసీసీఐతో అన్ని తెగతెంపులు చేసుకోవాల్సి ఉంటుందని.. ధోనీ విషయంలో కూడా అదే వర్తిస్తుందని చెప్పాడు.
'అన్ని రకాల ఆటల నుండి రిటైర్ అయ్యేంత వరకు దేశీయ ఆటగాళ్లతో సహా ఏ భారతీయ ఆటగాడు మరే ఇతర లీగ్లో పాల్గొనలేడని స్పష్టమైంది. ఏదైనా ఆటగాడు సౌతాఫ్రికా లేదా యూఏఈ లీగ్లలో పాల్గొనాలనుకుంటే అతను బీసీసీఐతో అన్ని సంబంధాలను తెంచుకున్న తర్వాత అతనికి అవకాశం ఉంటుంది. ' అని బీసీసీఐ అధికారి ఇండియన్ ఎక్స్ప్రెస్తో అన్నారు. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటికీ.. ఐపీఎల్లో ఆడుతున్నాడు. మెంటార్గా పనిచేస్తున్నాడు.
అతను సీఎస్ఏ టీ20 లీగ్కు మెంటార్గా పనిచేయాలంటే ఐపీఎల్లో తన సంబంధాలను తెంచుకోవలసి ఉంటుంది. సీఎస్ఏ టీ20 లీగ్లో ధోని సీఎస్కే జట్టుకు మెంటార్గా ఉండాలంటే.. అతను ఐపీఎల్ నుండి కూడా రిటైర్ కావాలి. అప్పుడు అతను సీఎస్కే కోసం ఐపీఎల్లో ఆడలేడు.' అని చెప్పాడు.
ఇకపోతే సీఎస్ఏ టీ20 లీగ్ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ కోసం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కూడా దక్షిణాఫ్రికా రద్దు చేసుకుంది. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా సీఎస్ఏ లీగ్ విషయంలో చాలా ఆసక్తి కనబర్చుతున్నాయి.