
ఆరు దేశాల టోర్నీ..
అదే- ఆసియా కప్ 2022. క్రికెట్ ఆడే ఆరు దేశాలు ఇందులో తలపడనున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఆడబోతోన్నాయి. ఆరో జట్టు ఏదనేది ఇంకా తేలాల్సి ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, సింగపూర్, హాంకాంగ్ జట్లు ఆరో స్థానం కోసం పోటీ పడుతోన్నాయి. ఆగస్టు 6వ తేదీన క్వాలిఫయర్ మ్యాచ్ ఉంటుంది. ఇందులో గెలిచిన జట్లు ఆసియా కప్ 2022లో చోటు దక్కించుకుంటుంది.

27న తొలి మ్యాచ్..
యుఏఈ వేదికగా ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. ఈ నెల 27వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. శ్రీలంక-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ టోర్నమెంట్లో ఆడే జట్లతో కూడిన జాబితాను ప్రకటించడానికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ డెడ్లైన్ విధించింది. ఆగస్టు 8వ తేదీ నాటికల్లా జట్టు ప్లేయర్ల జాబితాను అందజేయాలని ఆయా దేశాల క్రికెట్ బోర్డులను ఆదేశించింది.

ఆగస్టు 8న జట్టు ఎంపిక..
దీనితో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్షన్ కమిటీ దీనిపై దృష్టి పెట్టింది. డెడ్లైన్ నాడే జట్టును ఎంపిక చేయనుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ ద్వైపాక్షిక సిరీస్లల్లో ప్లేయర్ల ప్రతిభను ఆధారంగా చేసుకుని జట్టును ఎంపిక చేయనుంది. ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ కావడం, పాకిస్తాన్ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సెలెక్టర్లు ఆచితూచి జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా సిరీస్లల్లో ఆటగాళ్ల ప్రతిభను గీటురాయిగా తీసుకోనుంది.

కోహ్లీ, కేఎల్ రాహుల్..
అంతా సవ్యంగానే ఉన్నప్పటికీ.. ఇద్దరు కీలక ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వ్యవహారం- సెలెక్టర్లకు మింగుడు పడట్లేదు. విరాట్ కోహ్లీ ఫామ్ను కోల్పోయాడు. తన స్థాయికి తగ్గ ఆటతీరును అతను ప్రదర్శించట్లేదు. ఐపీఎల్ టోర్నమెంట్లోనూ అతను పెద్దగా భారీ స్కోర్ చేసిన మ్యాచ్లు లేవు. ఆ తరువాత ఇంగ్లాండ్ సిరీస్లోనూ అదే పేలవమైన ఫామ్ను కొనసాగించాడు. విశ్రాంతి పేరుతో వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు దూరం అయ్యాడు.

కోహ్లీపై మల్లగుల్లాలు..
ఫామ్ను కోల్పోయిన విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై సెలెక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. పైగా- తాను ఆసియా కప్కు అందుబాటులో ఉంటానని విరాట్ కోహ్లీ కూడా స్పష్టం చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు కూర్పు సెలెక్టర్లు పెను సవాల్గా మారే అవకాశాలు లేకపోలేదు. అదే సమయంలో గాయం వల్ల క్రికెట్కు దూరంగా ఉంటూ వస్తోన్న కేఎల్ రాహుల్ అంశం కూడా తలపట్టుకునేలా చేస్తోంది.

కేఎల్ రాహుల్ కోవిడ్తో..
కేప్టెన్ రోహిత్ శర్మతో కలిసి రెగ్యులర్గా జట్టు ఇన్నింగ్ను ఆరంభించే కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడం వల్ల ఓపెనింగ్ సమస్యను ఎదుర్కొంటోంది టీమిండియా. దీన్ని అధిగమించాలంటే కేఎల్ రాహుల్ పునరాగమనం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అతను కోవిడ్ బారిన పడ్డాడు. దీనితో అతని పేరును సెలెక్టర్లు ఆసియా కప్ కోసం పరిశీలనలోకి తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications
