
హైదారాబాద్: యాషెస్ సిరీస్ను మళ్లీ ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. పెర్త్లోని వాకా స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది.
కీలకమైన మూడో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వాకా స్టేడియంలో ఇంగ్లాండ్కు ఇది ఎనిమిదో ఓటమి కావడం విశేషం. తొలి ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీతో (239)తో మెరిసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

నాలుగో రోజు వర్షం అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగో రోజు 66 ఓవర్ల మ్యాచ్ మాత్రమే సాగింది. ఇక, ఐదో రోజు తడిసిన పిచ్పైనే ఇంగ్లాండ్ను ఆడించడం వివాదాస్పదమైంది. నాలుగో రోజైన ఆదివారం వర్షం వల్ల ఆట త్వరగా ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 132 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
దీంతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం దాదాపు ఖరారైంది. అయితే రాత్రి వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మారింది. మైదానం సిబ్బంది శ్రమించి మైదానం సిద్ధం చేసినప్పటికీ సంతృప్తి చెందని అంపైర్లు ముందు ఆటకు అనుమతించలేదు. చివరకు మధ్యాహ్నం ఆటకు అంఫైర్లు అనుమతి ఇచ్చారు.
రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా పేసర్ హాజెల్ఉడ్ (5/48) దెబ్బకు ఇంగ్లాండ్ కకావిలకం అయింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన డేవిడ్ మలన్ రెండో ఇన్నింగ్స్లో కూడా హాఫ్ సెంచరీతో రాణించడం ఇంగ్లాండ్కు ఊరటనిచ్చే అంశం. ఇక, మిగతా బ్యాట్స్మెన్ జానీ బెయిన్ స్టో (14), మెయిన్ అలీ (11), క్రిస్ వోక్స్ (22), ఓవర్టన్ (12) పూర్తిగా విఫలమయ్యారు.
తొలి ఇన్నింగ్స్లో 403 పరుగులు చేసినా ఇంగ్లాండ్ ఓడిపోవడం గమనార్హం. ఒక టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందలకు పైగా పరుగులు చేసి ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైన చెత్త రికార్డును కూడా ఇంగ్లాండ్ అత్యధిక సార్లు నమోదు చేసింది. ఇలా ఇంగ్లండ్ ఓటమి పాలు కావడం నాలుగోసారి.
స్కోరు వివరాలు:
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 403 ఆలౌట్ (115.1 ఓవర్లకు)
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 662/9 డిక్లేర్డ్ (179.3 ఓవర్లకు)
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 218 ఆలౌట్ (72.5 ఓవర్లకు)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.