Asia Cup 2025: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. నెల రోజులు కూడా లేదు. సెప్టెంబర్ 9వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దీనికి వేదిక. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్లో జరుగుతుంది.
ఈ ఎడిషన్లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్లు జరుగుతాయి. ఇప్పటికే మ్యాచ్ ల తేదీలు, గ్రూపులు, వెన్యూలు ఖరారయ్యాయి కూడా.

చిరకాల ప్రత్యర్థుల మధ్య మూడు హై-ఓల్టేజ్ మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది. అన్నీ సవ్యంగా సాగితే.. భారత్- పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు ఉండొచ్చు. గ్రూప్, సూపర్ 4లల్లో భారత్- పాకిస్తాన్ ఎదురుపడొచ్చు. ఈ రెండు జట్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించగలిగితే ఫైనల్స్ లో ఢీ కొనడం ఖాయమౌతుంది.
ఈ టోర్నమెంట్ లో ఆడబోయే భారత జట్టు ఎంపికపై అందరి దృష్టీ నిలిచింది. టీ20 ఫార్మట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడే మెరికల్లాంటి ప్లేయర్లు అందుబాటులో ఉన్నందున.. ఎవరికి అవకాశం దక్కుతుందనేది చర్చనీయాంమౌతోంది. ఇది- బీసీసీఐ సెలెక్షన్ కమిటీకి సవాల్ విసురుతోంది.
యువ ఆటగాళ్లల్లో అందరూ దాదాపుగా ఆల్ రౌండర్లే ఉండటం.. జట్టు కూర్పు కత్తిమీద సాములా మారింది. ప్రత్యేకించి ఓపెనర్లు. అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్.. వీరందరూ దూకుడుగా ఇన్నింగ్ ను ఆరంభించే సత్తా ఉన్నవాళ్లే. వీరిలో ఎంతమందికి అవకాశం వస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఈ వారం చివర్లో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఫిట్ నెస్ ప్రాతిపదికన ఎంతమంది టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నారనేది ఆరా తీస్తుంది. అనంతరం ఈ నెల 20వ తేదీన జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రాథమిక అంచనాల ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్ బ్యాటర్), తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా/ప్రసిద్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ/జురెల్ కు అవకాశం లభించవచ్చు.