ఇంగ్లండ్తో జరగనున్న చివరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించనట్లుగానే విరాట్ కోహ్లి టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరమయ్యాడని బీసీసీఐ తెలిపింది. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు గాయాలతో రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగొచ్చారు. అయితే వైద్యబృందం ఇచ్చే క్లియరెన్స్ను బట్టి జట్టులోకి వస్తారని బీసీసీఐ తెలిపింది.
మరోవైపు శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. అతడి గురించి బీసీసీఐ వివరణ ఇవ్వలేదు. గాయం కారణంగా అతడు ఎంపిక కాలేదని సమాచారం. యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్ జట్టులో తమ స్థానాన్ని నిలుపుకున్నారు. యువ పేసర్ ఆకాశ్ దీప్కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లొ ఆకాశ్ సత్తాచాటాడు. దీంతో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్తో అతడు పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.

అయితే రంజీ ట్రోఫీలో వరుస శతకాలు బాదుతున్న పుజారాకు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. యువ ప్లేయర్ల వైపు మొగ్గుచూపారు. అలాగే ఆవేశ్ ఖాన్, సౌరభ్ కుమార్లను జట్టు నుంచి తప్పించారు. రెండో టెస్టు కోసం జడేజా స్థానంలో సౌరభ్ ఎంపికైన విషయం తెలిసిందే.
కాగా, అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23నుంచి రాంచీలో నాలుగో టెస్టు, మార్చి 7వ తేదీ నుంచి చివరి టెస్టు ధర్మశాలలో జరగనుంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించగా, రెండో మ్యాచ్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్