టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఐపీఎల్లో గ్రాండ్గా పునరాగమనం చేయాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ మెగా లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టును హార్దిక్ నడిపించనున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్తో ముంబై కెప్టెన్ హార్దిక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను హార్దిక్ వివరించాడు. దేశం తరఫున వరల్డ్ కప్లో పోరాడాలని, గాయం నుంచి త్వరగా కోలుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశానని హార్దిక్ తెలిపాడు. అయినప్పటికీ ఆటకు దూరం కావాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. గతేడాది అక్టోబర్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో హార్దిక్ గాయపడిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో బంతిని ఆపే క్రమంలో అదుపుతప్పడంతో హార్దిక్ చీలమండకు గాయమైంది.అప్పటికీ ప్రపంచకప్లో భారత్ మరో అయిదు లీగ్ మ్యాచ్లు, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గాయం నుంచి త్వరగా కోలుకోవాలని తన శాయశక్తులా ప్రయత్నించానని హార్దిక్ తెలిపాడు.
''అయిదు రోజుల్లో తిరిగి వస్తానని మేనేజ్మెంట్తో చెప్పాను. నా చీలమండపై మూడు చోట్ల ఇంజెక్షన్లు తీసుకున్నాను. అంతేగాక చీలమండ నుంచి రక్తాన్ని కూడా బయటకు తీయాల్సి వచ్చింది. ఎంతో ప్రయత్నించాను. కానీ ఆ గాయం తీవ్రత మూడు నెలలకు దారితీసింది. ఆ స్థితిలో నడవలేకపోయాను. అయినా దేశం కోసం వరల్డ్ కప్లో పోరాడాలని పది రోజులు పెయిన్ కిల్లర్స్ కూడా తీసుకున్నాను. అయినప్పటికీ ప్రపంచకప్కు దూరమవ్వాల్సి వచ్చింది'' అని హార్దిక్ తెలిపాడు.
గుజరాత్ టైటాన్స్ను రెండు సార్లు ఫైనల్కు చేర్చిన హార్దిక్ ట్రేడింగ్లో ముంబై ఇండియన్స్కు వెళ్లాడు. అంతేగాక సారథి బాధ్యతలు అందుకున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలను అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. రోహిత్ శర్మ అయిదు టైటిళ్లు గెలిచి విజయవంతమైన కెప్టెన్గా ఉన్నాడు. కానీ ఫ్రాంచైజీ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని హార్దిక్ వైపు ఫ్రాంచైజీ మొగ్గు చూపడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి.
2021లో గుజరాత్ను ఛాంపియన్ నిలిపిన హార్దిక్కు ముంబై పగ్గాలు అందివ్వడంలో తప్పులేదని కొందరు మద్దతు ఇచ్చారు. టీమిండియాను నడిపించే రోహిత్ను ముంబై కెప్టెన్గా మరికొన్ని సీజన్లు కొనసాగించాల్సిందని మరికొందరు తమ వాదన వినిపించారు.