ఐపీఎల్లో అయిదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన ముంబయి ఇండియన్స్ నిర్ణయంపై చర్చ సాగుతూనే ఉంది. ముంబయి గూటికి హార్దిక్ పాండ్య తిరిగి రావడం, కెప్టెన్ పగ్గాలు అందుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్ రోహిత్ను తప్పించడంపై ఇటీవల వివరణ కూడా ఇచ్చాడు. ఇదంతా క్రికెటింగ్ వ్యవహారమని తెలిపాడు.
మరోవైపు దీనిపై రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దేహ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెప్టెన్సీ మార్పు నిర్ణయంలో చాలా తప్పులు ఉన్నాయంటూ రితికా కామెంట్ చేశారు. కొన్నిరోజులకే తన భార్య రితికాను రోహిత్ ఇండైరెక్ట్గా వెనకేసుకొచ్చాడు. నా భార్య ఎప్పుడూ నావైపే ఉంటుందని ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. ఈ విషయాలతో ముంబయి జట్టులో విభేదాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం సాగుతుంది.

ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ముంబయి ఇండియన్స్ గురించి మాట్లాడాడు. ''తమ ప్రాంఛైజీ భవిష్యత్ గురించి ఆలోచించి ముంబయి ఇండియన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మకు ఇప్పుడు 36 ఏళ్లు. అంతేగాక టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తిస్తూ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. దీంతో రోహిత్కు కాస్త ఉపశమనం ఇవ్వడానికి యువ ప్లేయర్ అయిన హార్దిక్ పాండ్యకు కెప్టెన్ పగ్గాలు అందించారు''
''హార్దిక్ కొత్త ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ను వరుసగా రెండు సార్లు ఫైనల్కు చేర్చాడు. ఒక్కసారి టైటిల్ కూడా గెలిచాడు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని ముంబయి ఈ నిర్ణయం తీసుకుంది. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ ముంబయి ఇండియన్స్కు ఎంతో లాభదాయకం.
రోహిత్కు ఇప్పుడు పూర్తి స్వేచ్ఛగా బరిలోకి దిగుతాడు. టాప్ ఆర్డర్లో రోహిత్ ఫ్రీగా తన శైలికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేయొచ్చు. హార్దిక్ మూడో స్థానంలో లేదా అయిదో స్థానంలో బ్యాటింగ్ వస్తే ముంబయి 200కు పైగా పరుగులు సాధించవచ్చు'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా, గాయం కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి శ్రమిస్తున్నాడు.