టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ టీ20 జట్టులో చోటు కోల్పోయి దాదాపు ఏడాదిన్నర దాటింది. 2022 టీ20 వరల్డ్ కప్ ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనలే అతనికి చివరి టీ20. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్కు రాహుల్ను సెలక్టర్లు పక్కనపెట్టారు. యువకులకు వరుసగా అవకాశం ఇచ్చారు.
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అతడు తిరిగి టీ20 జట్టులో ఎంపిక అవుతాడని భావించారంతా. కానీ అతడికి నిరాశే ఎదురైంది. ఇటీవల అఫ్గానిస్థాన్తో జరిగి టీ20 సిరీస్లో రాహుల్ను సెలక్టర్లు ఎంపికచేయలేదు. దీంతో 2024 ప్రపంచకప్ జట్టులో రాహుల్కు అవకాశం దక్కడం కష్టమే అనే వాదనలు వినిపించాయి.

అయితే కేఎల్ రాహుల్ వరల్డ్ కప్కు సెలక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేర్కొన్నాడు. కానీ దాని కోసం అతడు ఓపెనింగ్ స్థానాన్ని వదులుకోవాలని మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని రాయుడు సూచించాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున కూడా మిడిలార్డర్లో రాహుల్ బ్యాటింగ్కు రావాలని, అలాగే తిరిగి ఫామ్లోకి రావాలని అన్నాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన రాహుల్ 126 పరుగులే చేశాడు.
''కేఎల్ రాహుల్ తిరిగి ఫామ్లోకి రావాలి. అయితే అతడు టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ఉండాలంటే తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవాలి. మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రావాలి. ఎందుకంటే జట్టులో ఓపెనర్ స్థానానికి ఇప్పటికే ఎంతో మంది పోటీలో ఉన్నారు. అతడు నాలుగో స్థానంలో క్రీజులోకి రావాలి. లక్నో సూపర్ జెయింట్స్కు కూడా ఇది మంచిదే. మిడిలార్డర్లో వచ్చి ఇన్నింగ్స్ ఆఖరి వరకు నిలిచే ప్లేయర్లను టీమిండియా కూడా కోరుకుంటుంది'' అని రాయుడు తెలిపాడు.
జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇస్తున్నాయి. గ్రూప్ స్టేజ్లు అమెరికాలో జరగనున్నాయి. కాగా, రోహిత్తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ను ప్రారంభించడానికి యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ పోటీలో ఉన్నారు.