ఊహించినట్టుగానే ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్పై భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది. ముందుగా బంతితో పైచేయి సాధించిన టీమిండియా తర్వాత బ్యాటుతోనూ సత్తాచాటుతుంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు రోజు ఆట ముగిసేసరికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 421/7 స్కోరు సాధించింది. ఇంగ్లిష్ జట్టు కంటే రోహిత్ సేన 175 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
అయితే తమ జట్టు వ్యూహాలే తమ కొంపముంచాయని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లతో దాడి చేయాలనే ఉద్దేశంతో ప్రధాన పేసర్ అండర్సన్ను పక్కనపెట్టడంపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. అండర్సన్ ఉంటే భారత్ స్కోరును కట్టడిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నాడు.

'' అండర్సన్ జట్టులో ఉంటాడనుకున్నా. కానీ ముగ్గురు స్పిన్నర్లతో ఆడతామని అతడిని పక్కనపెట్టడం ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టులో జో రూట్తో కలిపి నలుగురు స్పిన్నర్లు ఉన్నారు.ఒక్క పేసర్ను మాత్రమే తీసుకున్నారు. అయితే పిచ్ స్పిన్కు అనూలిస్తుందని స్పిన్నర్లను బరిలోకి దించారు. దీంతో గత కొన్ని నెలలుగా జట్టుకు దూరమైన జాక్ లీచ్ వచ్చాడు. అతడితో పాటు అరంగేట్ర స్పిన్నర్, ఒక టెస్టు ఆడిన అనుభవం ఉన్న మరో స్పిన్నర్ జట్టులో చోటు దక్కించుకున్నారు''
''రీఎంట్రీ ఇచ్చిన లీచ్తో ఎంతమేర బౌలింగ్ చేయించగలరు? అతడితో రెండో స్పిన్నర్గా యువ స్పిన్నర్లు రెహాన్, హర్ట్లీ ఎంత మేర రాణించగలరు? ఇలాంటి పరిస్థితుల్లో అండర్సన్ మ్యాచ్ను నియంత్రణలోకి తీసుకురాగలడు. అండర్సన్ కాకపోతే మరో సీమర్ రాబిన్సన్. అయితే ఉపఖండ్ పిచ్లపై అండర్సన్కు అపారానుభవం ఉంది. కట్టర్స్, రివర్స్ స్వింగ్ చేస్తూ పరిస్థితులను కంట్రోల్లోకి తీసుకువచ్చేవాడు'' అని నాజర్ హుస్సేన్ పేర్కొన్నాడు.

అరంగేట్ర స్పిన్నర్ టామ్ హర్ట్లీ కేఎల్ రాహుల్ (86), శుభ్మన్ గిల్ (23) వికెట్లు తీసుకున్నాడు. కానీ 5.20 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. మరో యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చాడు. 4.60 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేసి శ్రేయస్ అయ్యర్ వికెట్ (35) వికెట్ పడగొట్టాడు. మరోవైపు యశస్వీ జైశ్వాల్ (80), కేఎస్ భరత్ (41) వికెట్లను సాధించిన జో రూట్ 2.80 ఎకానమీ రేటుతో బౌలింగ్ చూశాడు.