తిరిగి ముంబయి ఇండియన్స్ ప్రాంఛైజీకి చేరడం సంతోషంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)లో రాయుడు ముంబయి ఇండియన్స్ ఎమిరేట్స్ (MI ఎమిరేట్స్) తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐఎల్టీ20 లీగ్లో ఎంఐ ఎమిరేట్స్తో ఒప్పందం చేసుకున్నాడు. అయితే తాజాగా ఎమిరేట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు ఆసక్తికర కబుర్లు చెప్పాడు.
''ఐపీఎల్లో అరంగేట్రం చేసిన 2010 ఏడాదిలో వ్యక్తిగతమైన, ముంబయి ఇండిన్స్కు సంబంధించిన ఎన్నో ప్రత్యేకమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అక్కడ సచిన్ టెండూల్కర్, రాబిన్ సింగ్ ఉన్నాం. ఆ ఏడాది అసాధారణైనది. ఎనిమిదేళ్లలో అయిదు టోర్నమెంట్లు (మూడు ఐపీఎల్, రెండు సీఎల్టీ20) గెలవడం గొప్ప విషయం. ఇవే కాకుండా మరో ఫైనల్ కూడా ఆడాం. బ్లూ అండ్ గోల్డ్ జెర్సీతో నాకు మంచి మెమోరీస్ ఉన్నాయి. ఇఫ్పుడు కెరీర్ చివర్లో ఉన్న నేను మరోసారి బ్లూ అండ్ గోల్స్ జెర్సీ ధరించడం ప్రత్యేకంగా అనిపిస్తుంది''

''ముంబయి ఇండియన్స తత్వశాస్త్రం ఎలా ఉంటుందంటే.. ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లా జట్టును తీర్చిదిద్దుతారు. ఏదో ఒక స్థాయిలో జట్టును గెలిపించేలా వాతావరణం ఉంటుంది. బ్యాటుతో కాకపోతే, మైదానంలో క్యాచ్తో లేదా రనౌట్తో జట్టుకు ఉపయోగపడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీన్ని మేం ముంబయి ఇండియన్స్ యాటిట్యూట్ అని పిలుస్తాం. ప్రతి ఒక్కరూ జట్టు కోసం శాయశక్తులా పోరాడేలా ఉంటారు. చివరి బంతికి సిక్సర్ సాధించడానికైనా సరే'' అని రాయుడు పేర్కొన్నాడు.
అయితే ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో రాయుడు అంచనాలకు తగ్గట్లుగా విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడలేకపోతున్నాడు. ఇటీవల డిజర్ట్ వైపర్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఇన్నింగ్స్ ఆడి జట్టు ఓటమికి అతడు కూడా ఓ కారణమయ్యాడు. 30 బంతులు ఎదుర్కొని 23 పరుగులే చేశాడు. మరోవైపు రాజకీయాల్లో రాయుడు ఇన్నింగ్స్ భిన్నంగా కొనసాగిన విషయం తెలిసిందే.
ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ కండువ కప్పుకున్నాడు. కానీ కొన్ని రోజులకే రాజకీయాలకు బైబై చెప్పాడు. ఐఎల్ టీ20 టోర్నీ కోసం ఏ రాజకీయ పార్టీలో ఉండకూడదని, అందుకే దూరంగా ఉంటున్నానని చెప్పాడు. ఈ ప్రకటన చేసిన 24 గంటల వ్యవధిలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్తో రాయుడు సమావేశమవ్వడం గమనార్హం.