టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మైదానంలో దూకుడుగా ఉంటాడు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు కవ్విస్తే ఏ మాత్రం సహించడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మెంటార్గా బాధ్యతలు నిర్వహిస్తున్న గంభీర్ ఐపీఎల్లోనూ అదేరీతిలో స్పందిస్తున్నాడు. అయితే ఆ హీట్ అంతా మైదానం వరకే. తర్వాత గంభీర్ కూల్గా ఉంటాడు. ప్లేయర్ల ప్రదర్శనపై వ్యాఖ్యాతగా గొప్పగా విశ్లేషిస్తుంటాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంభీర్ కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. క్రికెటర్ కాకపోతే ఏమి అవుతారని ప్రశ్నించగా ఆర్మీలో చేరి ఉండేవాడినని చెప్పాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్గా అవకాశం వస్తే ఎలా చేస్తారు? అనే ప్రశ్నకు.. ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన లేదని చెప్పాడు. వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా తరపున రీజా హెండ్రిక్స్ ఆడితే ఎలా ఉండేది అనే ప్రశ్నకు.. ఫలితం మరోలా ఉండే అవకాశం ఉందని గంభీర్ చెప్పాడు.

ఐపీఎల్ ప్రారంభించకపోతే ఎలా ఉండేదనే ప్రశ్నకు.. బీసీసీఐ తీసుకునే చెత్త నిర్ణయం అయ్యేదని గంభీర్ అన్నాడు. భారత క్రికెట్లో ఐపీఎల్ గొప్ప విజయమని పేర్కొన్నాడు. గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా బాధ్యతలు నిర్వర్తించిన గంభీర్ ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్కు వెళ్లిన సంగతి తెలిసిందే. గంభీర్ కలిసిన తర్వాత కోల్కతా ఫ్రాంచైజీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
శ్రేయస్ అయ్యర్ను తిరిగి కెప్టెన్గా చేసి.. నితీశ్ రాణాను వైస్ కెప్టెన్గా నియమించింది. అలాగే ఇటీవల జరిగిన వేలంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ ఆల్టైమ్ రికార్డు ధర వెచ్చించింది. స్టార్క్ కోసం ఏకంగా రూ.24.75 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యంత ఖరీదు ధర.
వేలంలో కోల్కతా సొంతం చేసుకున్న ఆటగాళ్లు: మిచెల్ స్టార్క్ (రూ. 24.75 కోట్లు), ముజీబ్ రెహ్మాన్ (రూ. 2 కోట్లు), రూథర్ఫర్డ్ (రూ. 1.50 కోట్లు), అట్కిన్సన్ (రూ. 1 కోటి), మనీశ్ పాండే (రూ. 50 లక్షలు), కేఎస్ భరత్ (రూ. 50 లక్షలు), చేతన్ సకారియా (రూ.50 లక్షలు), రఘువన్షీ (రూ.20 లక్షలు), రమణ్దీప్ (రూ.20 లక్షలు), షకిబ్ హుస్సేన్ (రూ.20 లక్షలు)