సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (101) శతకం సాధించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసేసరికి అయిదు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. 11 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న డీన్ ఎల్గర్ (140*) సెంచరీతో సత్తాచాటాడు.
అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ వ్యూహాలు అవలంభిస్తున్నాడని వ్యాఖ్యాతలు రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డారు. బౌలర్లను రోహిత్ ప్రయోగించిన తీరు నిరాశగా ఉందని అన్నారు. లంచ్ బ్రేక్లో కోచ్ రాహుల్ ద్రవిడ్తో కలిసి రోహిత్ తీసుకున్న నిర్ణయాలతో టీమిండియా ఇబ్బందుల్లో పడిందని చెప్పారు.

''ఏ సెషన్ ప్రారంభంలో అయినా అత్యుత్తమ బౌలర్లతో ప్రత్యర్థిపై దాడి చేయాలి. కోచ్గా నేను ఉన్నప్పుడు మేం ఇదే విషయాన్ని చాలా సార్లు చర్చించుకున్నాం. కానీ రోహిత్ అలా చేయలేదు. లంచ్ బ్రేక్ తర్వాత శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణతో బౌలింగ్ చేయించాడు. వీరిద్దరితో బౌలింగ్ ప్రయోగించడం వ్యూహాత్మకంగా అతి పెద్ద తప్పు. ఇలా చేసి ఉండకపోతే భారత్ ఆ సెషన్ తొలి అరగంటలో పైచేయి సాధించేది'' అని రవిశాస్త్రి అన్నాడు.
ఇదే విషయంపై సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ''టీమిండియా ఈ వ్యూహాన్ని అమలు చేయలదు. శార్దూల్, ప్రసిధ్లతో బౌలింగ్ చేయించాడు. బ్రేక్ సమయంలో కోచ్ ద్రవిడ్తో కలిసి రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు'' అని అన్నాడు.
కామెంటరీ బాక్స్లో ఉన్న మరో వ్యాఖ్యాత సౌతాఫ్రికా మాజీ పేసర్ ఫిలాండర్ కూడా టీమిండియా పొరపాటు చేసిందని పేర్కొన్నాడు. అయితే బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు. కానీ దాని వల్ల సౌతాఫ్రికా పోటీలోకి వచ్చిందని, భారత్ మంచి అవకాశాన్ని కోల్పోయిందని తెలిపాడు.