అనారోగ్యం కారణంగా అఫ్గానిస్థాన్తో తొలి మ్యాచ్కు దూరమైన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ రెండో టీ20లో అదరగొట్టాడు. 34 బంతుల్లో 68 పరుగులు సాధించి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆది నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. అయిదు ఫోర్లు, ఆరు సిక్సర్లతో సత్తాచాటాడు. అయితే మ్యాచ్ అనంతరం తన ప్రదర్శన గురించి జైశ్వాల్ మాట్లాడాడు.
''నా ఆటను స్వేచ్ఛగా ఆడమని సూచించారు. అది చేయడానికే ప్రయత్నించా. చెత్త బంతుల్ని బౌండరీకి తరలించడానికి ట్రై చేశా. అదిరే ఆరంభాన్ని జట్టుకి ఇవ్వాలని నేను భావిస్తాను. మంచి ఆరంభాన్ని ఇస్తూ, మెరుగైన స్ట్రైక్ రేట్తో క్రీజులో నిలవాలని అనుకుంటాను. దానికి తగ్గట్టుగానే ప్రాక్టీస్ చేస్తూ సన్నద్ధమవుతాను. అవకాశం దక్కినప్పుడూ సద్వినియోగం చేసుకోవాలని, జట్టు కోసం మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటాను''

'' విరాట్ కోహ్లితో కలిసి ఆడటం ఎంతో బాగుంటుంది. అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం గౌరవంగా భావిస్తా. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. క్రీజులో కోహ్లి ఉన్నప్పుడు.. అతనితో కలిసి ఎక్కడ షాట్లు ఆడాలో చర్చించుకున్నాం. తర్వాత ఓవర్ లాంగాన్, మిడ్ ఆఫ్ మీదుగా బౌండరీలు బాదాలని నిర్ణయించుకున్నాం. సానుకూల దృక్పథంతో మంచి షాట్లు ఆడాం'' అని యశస్వీ జైశ్వాల్ పేర్కొన్నాడు.
గతేడాది ఆగస్టులో టీ20ల్లో అరంగేట్రం చేసిన జైశ్వాల్ జట్టులో ఓపెనర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. ఎడమచేతి వాటం బ్యాటర్, స్ట్రోక్ ప్లేయర్ కావడంతో అతడికి అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారు. 16 టీ20లు ఆడిన జైశ్వాల్ 35 సగటుతో 498 పరుగులు చేశాడు. కాగా, ఇండోర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ (57; 35 బంతుల్లో) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన భారత్ 15.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జైశ్వాల్తో పాటు శివమ్ దూబె (63; 32 బంతుల్లో) రాణించాడు. బెంగళూరు వేదికగా జనవరి 17న ఆఖరి మ్యాచ్ జరగనుంది.