ఇటీవల జరిగిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో భారత్ విజయంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో తన టెస్టు కెరీర్లో 500 వికెట్ల మైలురాయిని, 100 టెస్టుల మార్క్ను అందుకున్నాడు. ఈ సందర్భంగా అశ్విన్ను తమిళనాడు క్రికెట్ అసోషియేషన్ సన్మానించింది.
అనంతరం అశ్విన్ తన కెరీర్లోని ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. మహేంద్రసింగ్ ధోనీకి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపాడు. ''2008లో మాథ్యూ హెడెన్, ఎంఎస్ ధోనీని వంటి దిగ్గజాలను కలిసే అవకాశం వచ్చింది. అయితే ముత్తయ్య మురళీథరన్ జట్టులో ఉండటంతో ఆ సీజన్లో బెంచ్కే పరిమితమయ్యాను. ఆ తర్వాత ధోనీ నాకు అవకాశం ఇచ్చాడు. ధోనీకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. క్రిస్ గేల్కు బౌలింగ్ చేయడానికి ధోనీ నాకు కొత్త బంతిని అందించాడు'' అని అశ్విన్ పేర్కొన్నాడు.

ఐపీఎల్ తొలి సీజన్లో అశ్విన్కు ఆడే అవకాశం రాలేదు. కానీ రెండో సీజన్లో ఛాన్స్ దక్కించుకుని వెలుగులోకి వచ్చాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే ఐపీఎల్లో కాంట్రాక్ట్ దక్కించుకోవడమే తన లైఫ్ టర్నింగ్ పాయింట్ అని అశ్విన్ పేర్కొన్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తన గురించి చేసిన వ్యాఖ్యలతో సీఎస్కే ఫ్రాంచైజీకి చేరుకున్నానని చెప్పాడు.
''2008లో తమిళనాడు క్రికెట్ అసోషియేషన్లోని ఫస్ట్ డివిజన్ మ్యాచ్ల్లో జాలీ రోవర్స్ జట్టు తరఫున ఇండియా సిమెంట్స్పై ఆడాను. ఆ మ్యాచ్లో ఆరు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాను. ఆ రోజు ముఖ్య అతిథిగా శ్రీకాంత్ వచ్చారు. అతను మైక్లో 'అశ్విన్.. సూపర్బ్గా బౌలింగ్ చేశావు. చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లి మురళీథరన్ దగ్గర ఆటను మెరుగుపర్చుకో' అని అన్నాడు''
''అప్పటికీ నేను సీఎస్కే జట్టులో లేను. అవకాశం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆ సమయంలో దేశీయ ఆటగాళ్లకు వేలం అంటూ ఏమీ లేదు. సీఎస్కే సీఈవో విశ్వనాథన్తో శ్రీకాంత్ ఇలా అన్నాడు. 'అతన్ని జట్టులో తీసుకోవట్లేదా?' అని అడిగాడు. ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చేసింది. తర్వాత రోజే సీఎస్కే కాంట్రాక్ట్ నాకు దక్కింది'' అని అశ్విన్ గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఐపీఎల్కు సన్నద్ధమవుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు.