ఇంగ్లాండ్తో జరుగుతున్న అయిదు టెస్టు సిరీస్లో టీమిండియానే ఫేవరేట్ అని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అన్నాడు. సిరీస్ను భారత్ 4-0తో లేదా 5-0తో గెలుస్తుందా అనే ఉత్కంఠ మాత్రమే నెలకొందని, ఇంగ్లాండ్పై అంచనాలు లేవని గంగూలీ తెలిపాడు. ప్రస్తుతం ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే.
శనివారం ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు కోల్పోయి 316 పరుగులు సాధించింది. 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఒల్లీ పోప్ (148*; 208) అద్భుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 421/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 436 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 246 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే.

అయితే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించి ఉంటే ఆ జట్టుకు విజయావకాశాలు ఉండేవని గంగూలీ అన్నాడు. టీమిండియాపై గెలవాలంటే ఇంగ్లిష్ జట్టు కనీసం 350 పరుగులు చేయాలని దాదా పేర్కొన్నాడు. ''టెస్టు సిరీస్ను భారత్ గెలుస్తుంది. 4-0 లేదా 5-0తో సిరీస్ను సొంతం చేసుకుంటదా అనే విషయంపైనే ఆసక్తి ఉంది. అయితే ప్రతి మ్యాచ్ నిర్ణయాత్మకంగా ఉంటుంది.
టీమిండియాపై ఇంగ్లాండ్ గెలవాలంటే గొప్పగా బ్యాటింగ్ చేయాలి. 230 నుంచి 240 పరుగులు చేసి భారత్లో భారత్పై గెలవలేరు. 350-400 పరుగులు చేస్తేనే రోహిత్ సేనను ఓడించే అవకాశాలు ఉంటాయి. కానీ ఇంగ్లాండ్ అలా సాధించలేకపోయింది. ఇంగ్లాండ్కు ఇది కఠినమైన సిరీస్. ఆస్ట్రేలియా మినహా ఏ ఇతర జట్టు ఇక్కడ ప్రభావం చూపలేకపోయింది'' అని గంగూలీ అన్నాడు.
జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడుతూ.. '' గత వన్డే ప్రపంచకప్లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. టోర్నీ ఆద్యంతం సత్తాచాటిన భారత్ తుదిపోరులో తడబడుతుందని నేను ఊహించలేదు. కానీ క్రీడల్లో ఇలా జరుగుతుంటాయి. అయితే టీ20 ప్రపంచకప్ గెలవడానికి టీమిండియాకు మంచి అవకాశాలు ఉన్నాయి. వెస్టిండీస్, అమెరికాలోని పరిస్థితులు భారత్లో మాదిరిగానే ఉండటం సానుకూలాంశం. టీ20 వరల్డ్ కప్కు ఐపీఎల్ మంచి సన్నాహకంగా ఉంటుంది'' అని గంగూలీ తెలిపాడు.