అంతర్జాతీయ క్రికెటర్కు గుడ్బై పలికి కొన్నేళ్లు గడిచినా మహేంద్రసింగ్ ధోనీకి ఆదరణ ఇప్పటికీ తగ్గలేదు. ఐపీఎల్తోనే కాకుండా యాడ్ షూటింగ్స్తోనూ ధోనీ ఆదాయాన్ని అర్జిస్తున్నాడు. అయితే ధోనీ తన చిన్ననాటి స్నేహితుడి కోసం చేసిన ఓ పని నెట్టింట్లో వైరల్గా మారింది. స్నేహం కోసం అతడి చేసిన పనిని నెటిజన్లు కొనియాడుతున్నారు. అసలేం జరిగిదంటే..
మరికొన్ని వారాల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ధోనీ తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్లో కఠోర సాధన చేస్తున్నాడు. అయితే అందరిచూపు ధోనీ బ్యాటు వైపు మళ్లింది. 'ప్రైమ్ స్పోర్ట్స్' అనే స్టిక్కర్ ఉన్న బ్యాటుతో ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. క్రికెట్ ఫ్యాన్స్కు ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. దీంతో అది ఎవరిది అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

కాగా, ధోనీ చిన్ననాటి స్నేహితుడు పరమ్జిత్ సింగ్కు చెందిన కంపెనీయే 'ప్రైమ్ స్పోర్ట్స్'. ధోనీ కెరీర్ ప్రారంభంలో పరమ్జిత్ ఎంతో సాయంపడ్డాడు. ధోనీ బయోపిక్ సినిమా 'ఎంఎస్ ధోనీ.. ది అన్టోల్డ్ స్టోరీ'లో వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చక్కగా తెరకెక్కించారు. టీమిండియాలో ధోనీ చోటు దక్కించుకోవడంలో పరమ్జిత్ సాయం కీలకం. ఈ నేపథ్యంలో ధోనీ తన స్నేహానికి గుర్తుగా ప్రైమ్ స్పోర్ట్స్ లోగోతో బరిలోకి దిగాడని తన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ధోనీ గొప్ప వ్యక్తిత్వానికి ఇది ఉదాహరణ అని, స్నేహం కోసం ఏమైనా చేస్తాడని కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్లో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయిదు సార్లు చెన్నైకి ధోనీ టైటిళ్లు అందించాడు. గత సీజన్లోనూ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై నెగ్గి సీఎస్కే ట్రోఫీని సొంతం చేసుకుంది. కాగా, గత సీజన్ అనంతరం ధోనీ మోకాలీ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇటీవల తిరిగి పూర్తిఫిటెనెస్ సాధించాడు. మరోవైపు గత మూడేళ్లుగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ధోనీ బరిలోకి దిగుతూ ట్రోఫీలను సాధిస్తున్నాడు.