ఇంగ్లండ్తో జరిగిన అయిదు టెస్టు సిరీస్లో భారత్ 4-1తో ఘనంగా నెగ్గింది. విజయంతో పాటు భవిష్యత్ భరోసా ఆటగాళ్లు టీమిండియాకు దొరకడం ఈ సిరీస్లో బోనస్ పాయింట్. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవదత్ పడిక్కల్ తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. రజత్ పటిదార్ ఫర్వాలేదనిపించాడు.
అయితే రిషభ్ పంత్ గైర్హాజరీలో టెస్టుల్లో భారత వికెట్ కీపర్ కోసం సెలక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో కొందరు అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే మరికొందరు గాయపడ్డారు. కానీ ధ్రువ్ జురెల్ అదరగొట్టాడు. వికెట్ కీపింగ్తో పాటు బ్యాటింగ్లో అలరించాడు. ప్రశాంతతో పాటు భారీ షాట్లతో విరుచుకుపడే సామర్థ్యంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీతో ధ్రువ్ జురెల్ను దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. భారత క్రికెట్కు మరో ధోనీ దొరికాడని కితాబిచ్చాడు. అయితే దీనిపై ధ్రువ్ జురెల్ స్పందించాడు. లెజెండరీ ధోనీతో ఎవరూ సరిపోలేరని, తానెప్పుడూ ధ్రువ్ జురెల్గానే ఉంటానని యువ వికెట్ కీపర్ పేర్కొన్నాడు.
''నన్ను ధోనీ సర్తో సునీల్ గవాస్కర్ సర్ పోల్చినందుకు చాలా థ్యాంక్స్. అయితే ధోనీని, ఆయన సాధించిన ఘనతలను ఎవరూ భర్తీ చేయలేరు. ఎప్పటికీ ధోనీ ఒక్కడే. నేను ధ్రువ్ జురెల్గానే ఉండాలనుకుంటున్నా. ఏం సాధించినా ధ్రువ్లానే సాధించాలనుకుంటున్నా. ధోనీ సర్ ఓ లెజెండ్. ఆయన ఎప్పుడూ అలానే ఉంటాడు''
''టెస్టు క్యాప్ను అందుకోవడం, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సాధించడంతో సరిపోలేదు. క్రికెట్లో స్వచ్ఛమైన రూపమైన టెస్టులు ఆడినందుకు సంతోషంగా ఉంది. ఏదో ఒక రోజు టెస్టు క్రికెట్ ఆడతానని అనుకునేవాడిని. నా కల నెరవేరింది. అయితే అండర్-19లో ఉన్నప్పుడు 200 టెస్టులు ఆడాలని కలలు కనేవాడిని. ఆ తర్వాత తెలిసింది అది అసాధ్యమని''
''నా దృష్టిలో ఐపీఎల్ టెస్టు క్రికెట్పై ప్రేమను తగ్గిస్తుందని భావించట్లేదు. భారత క్రికెట్ టెస్టు క్యాప్ అందుకున్నప్పుడు గొప్ప అనుభూతిని పొందాను. ఆ రెండు ఫార్మాట్ల మధ్య పోలిక లేదు. టెస్టు క్రికెట్ భిన్నమైనది'' అని ధ్రువ్ జురెల్ అన్నాడు. రాంచీ టెస్టులో అద్భుత పోరాటం చేసిన ధ్రువ్ జురెల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించిన విషయం తెలిసిందే.