
హైదరాబాద్: 2001లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాహుల్ ద్రవిడ్తో కలిసి తాను నెలకొల్పిన 376 పరుగుల చరిత్రాత్మక భాగస్వామ్యాన్ని వార్షిక 'పరిక్ష పె చార్చా' కార్యక్రమంలో విద్యార్ధులతో పంచుకున్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి టీమిండియా మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.
శనివారం లక్ష్మణ్ తన ట్విట్టర్లో "చారిత్రాత్మక కోల్కతా టెస్ట్ మ్యాచ్ కథను పంచుకున్నందుకు... యువ విద్యార్థులను ఉత్తేజపరిచినందుకు చాలా ధన్యవాదాలు మోడీజీ. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, నా సలహా ఇదే. మీ లక్ష్యాల గురించి స్పష్టంగా ఉండాలి... అది జరిగేలా ప్రయత్నించండి. మిమ్మల్ని ఎవరితోనూ పోల్చుకోవద్దు" అని ట్వీట్ చేశాడు.
ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్పై మోడీ ప్రశంసలు కురిపించిన వీడియోని సైతం ట్వీట్ చేశాడు. అంతకముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నన్ను ఉదాహరణగా చూపిస్తూ విద్యార్థుల్లో ప్రేరణ నింపడం ఎంతో గర్వంగా ఉందని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన ట్విట్టర్లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం 'పరీక్షాపే చర్చ' కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే పేరుని ప్రస్తావించిన ప్రధాని 2002లో వెస్టిండిస్తో జరిగిన ఆంటిగ్వా టెస్ట్లో గాయపడి కుంబ్లే బౌలింగ్ చేయడాన్ని గుర్తు చేశారు.
దీనిపై కుంబ్లే ట్విట్టర్లో "#ParikshaPeCharcha2020లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నన్ను ఉదాహరణగా చూపిస్తూ విద్యార్థుల్లో ప్రేరణ నింపడం ఎంతో గర్వంగా ఉంది. పరీక్షలు రాసే ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు" అని ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించి మోడీ మాట్లాడిన వీడియోను కూడా పోస్టు చేశాడు.
ఆంటిగ్వా వేదికగా 2002లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో కుంబ్లే దవడ ఎముకకు గాయమైంది. సర్జరీ చేయాల్సిన పరిస్థితి రావడంతో ఆయనను జట్టు నుంచి తప్పించాలని అనుకున్నప్పటికీ... అందరినీ ఆశ్చర్యపరుస్తూ కుంబ్లే తన దవడకు బ్యాండేజ్ వేసుకుని మరీ మ్యాచ్ని కొనసాగించాడు. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది.
ఇదే కార్యక్రమంలో 2001లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టుని ప్రస్తావించారు. "మన జట్టు కష్టాల్లో పడింది. ఆటగాళ్ల మూడ్కూడా బాగాలేదు. ఆ స్థితిలో లక్ష్మణ్, ద్రావిడ్ ఆడిన ఇన్నింగ్స్ను మరిచి పోగలమా. వారు మ్యాచ్ను మనవైపు తిప్పారు" అని ప్రధాని మోడీ ఆ టెస్టుని కూడా గుర్తు చేశారు.
స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసిన ఆలౌటైంది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా ఫాలో ఆన్ అడింది. రెండో ఇన్నింగ్స్లో లక్ష్మన్ 281 పరుగులు చేయగా, ద్రవిడ్ 180 పరుగులు చేశారు.
వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్లు కలిసి 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి 657 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్పై భారత స్పిన్నర్లు విజృంభించడంతో భారత్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టెస్టు భారత క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది.