హైదరాబాద్: సిడ్నీ వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను సాధించాడు. మూడో టెస్టు తొలిరోజైన మంగళవారం లంచ్ విరామానికి ముందు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ 78 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
టెస్టుల్లో వార్నర్కి ఇది 18వ టెస్టు సెంచరీ కాగా పాకిస్థాన్పై మూడో సెంచరీ కావడం విశేషం. మూడో టెస్టు లంచ్ విరామానికి ముందే 117 నిమిషాల్లో 17 ఫోర్లతో వార్నర్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరిస్లో వార్నర్కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం.

దీంతో లంచ్ విరామానికి ముందు సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా వార్నర్ అరుదైన ఘనత తనఖాతాలో వేసుకున్నాడు. గతంలో ట్రంపర్ (1902), చార్లెస్ మకార్ట్నే(1926), డాన్ బ్రాడ్ మన్(1930), మాజిద్ ఖాన్(1976)లో ఈ ఘనతను సాధించారు.
కాగా గతన నలభై ఏళ్లలో ఈ అరుదైన ఘనతను నెలకొల్పిన తొలి ఆటగాడిగా వార్నర్ చరిత్ర సృష్టించాడు. 1930లో లీడ్స్లో జరిగిన టెస్టు మ్యాచ్లో డాన్ బ్రాడ్మన్ లంచ్ విరామానికి ముందు 105 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా ఆ టెస్టులో బ్రాడ్మన్ 334 పరుగులతో ట్రిపుల్ సెంచరీ చేశాడు.
కాగా, మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో టెస్టులో 143 బంతుల్లో వార్నర్ 144 పరుగులు చేశాడు. సిడ్నీ టెస్టులో 95 బంతులను ఎదుర్కొన్న వార్నర్ 17 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేసి వహాబ్ రియాజ్ బౌలింగ్ లో సర్ఫరాజ్ అహ్మద్కి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో పెవిలియన్కు చేరాడు.
సిడ్నీ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. వార్నర్ మెరుపు ఇన్నింగ్స్తో 32 ఓవర్లకే ఆస్ట్రేలియా 150 పరుగులను అందుకుంది. ఆ తర్వాత వార్నర్ అవుటయ్యాడు. 88 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది.