న్యూజిలాండ్ పర్యటన గురించి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూనే ఉన్నాయి. దేశ గౌరవం కంటే డబ్బు గురించి నీచమైన నిర్ణయాలు తీసుకుంన్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా కూడా సౌతాఫ్రికా బోర్డుపై మండిపడ్డాడు. దీనిపై ఐసీసీతో పాటు బీసీసీఐ వంటి ప్రముఖ బోర్డులు దృష్టి సారించాలని కోరాడు.
అసలేం జరిగిందంటే.. న్యూజిలాండ్ పర్యటనకు సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి కివీస్తో సఫారీ సేన రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఎంపిక చేసిన 14 మంది జట్టులో సగం మందికి పైగా అన్క్యాప్డ్ ప్లేయర్లే ఉన్నారు. కెప్టెన్గా ఎంపికైన నీల్ బ్రాండ్ కూడా అరంగేట్రం చేయని ఆటగాడే కావడం గమనార్హం. సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం 'సౌతాఫ్రికా20' లీగ్ (SA20).

సౌతాఫ్రికా టీ20 లీగ్ జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10వరకు జరగనుంది. ఈ లీగ్లో ప్రధాన ప్లేయర్లను ఆడించాలని దక్షిణాఫ్రికా బోర్డు భావించింది. ఎందుకంటే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఎస్ఏ టీ20 లీగ్ భరోసా ఇచ్చింది. 2023 సీజన్లో లాభాలను తెచ్చిపెట్టింది. అంతేగాక సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు, ఎస్ఏ 20 మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆటగాళ్లు తప్పక అందుబాటులో ఉండాలి. దీంతో న్యూజిలాండ్కు అనుభవం లేని ఆటగాళ్లను ఎంపిక చేసింది.
''టెస్టు క్రికెట్ను చంపేస్తున్నారు. ఐసీసీతో పాటు బీసీసీఐ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు దీనిపై చొరవ తీసుకోవాలి. స్వచ్ఛమైన టెస్టు ఫార్మాట్ను కాపాడుకోవాలి. టెస్టు మ్యాచ్ ఫీజుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి.ఇలా చేస్తేనే బ్రాడ్మన్, సోబర్స్, గ్రేస్ వంటి దిగ్గజ ఆటగాళ్ల క్రికెట్ వారసత్వం కొనసాగుతుంది'' అని స్టీవ్ వా ఇన్స్టాలో రాసుకొచ్చి, న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన దక్షిణాఫ్రికా జట్టు ఫొటోను పోస్ట్ చేశాడు.