జూన్ 16న మాంచెస్టర్ వేదికగా
జూన్ 16న మాంచెస్టర్లోని ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. బీసీసీఐ సైతం భారత ప్రభుత్వం పాక్తో మ్యాచ్ ఆడకూడదని ఆదేశిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడుతామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్లో భారత్-పాక్ మ్యాచ్పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు.
వరల్డ్కప్లో పాక్పై ప్రతిసారీ భారత్దే పైచేయి
"వరల్డ్కప్లో పాకిస్థాన్పై ప్రతిసారీ భారత్దే పైచేయి. ఇది మరోసారి వారిని ఓడించే సమయం. రెండు పాయింట్లు అప్పగించి టోర్నీలో వారికి సాయం చేయడాన్ని నేను అసహ్యించుకుంటా. ఇంతకు ముందే చెప్పినట్టు నా దృష్టిలో భారత్కే ప్రథమ ప్రాధాన్యం. అందుకే నా దేశం తీసుకొనే నిర్ణయం ఏదైనా మనసారా ఆహ్వానిస్తా" అని సచిన్ అన్నాడు.
సునీల్ గవాస్కర్ సైతం ఇలా
మరో మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం వరల్డ్కప్లో పాక్ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు వరల్డ్కప్లో పాక్తో భారత్ ఆడకూడదు అని నిర్ణయం తీసుకుంటే అది మనకే నష్టమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "ఎందుకంటే పాక్తో భారత్ ఆడకపోతే ఆ జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. వరల్డ్కప్లాంటి టోర్నీలో రెండు పాయింట్లు వదులుకోవడం మంచిది కాదు. ఇప్పటివరకు ఆడిన ప్రతి వరల్డ్కప్లో పాకిస్థాన్ను మనం ఓడించాం. ఈ టోర్నీలో కూడా వాళ్లతో ఆడి ఓడించాలి" అని గవాస్కర్ అన్నాడు.
భారత్-పాక్ మ్యాచ్పై వినోద్ రాయ్ ఇలా
మరోవైపు వరల్డ్కప్లో పాక్తో మ్యాచ్ ఆడాలా వద్దా అన్న అంశంపై చర్చించడానికి శుక్రవారం బీసీసీఐ, సీఓఏ సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ మాట్లాడుతూ "మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. జూన్ 16 మ్యాచ్పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఐసీసీకి ప్రధానంగా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాం. టోర్నీ సందర్భంగా ఆటగాళ్లకు మరింత భద్రత కల్పించాలని, ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న దేశాలతో సంబంధాలు తెంపుకోవాలని ఐసీసీని కోరుతున్నాం. హోంమంత్రి వ్యాఖ్యలపై నేనేమీ స్పందించను. జూన్ 16కు ఇంకా చాలా రోజులు ఉంది" అని అన్నారు.