బెంగళూరు: పరాజయ భారంతో నిరాశలోకి కుంగిపోయిన తనకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అందించిన స్ఫూర్తి వచనాలు ఎంతో బాగా పనిచేశాయని తెలిపాడు భారత ఫుట్బాలర్ సందేశ్ జింగాన్. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫైనల్లో ఓడటంతో తీవ్ర ఒత్తిడికి లోనైన తాను అందులోనుంచి బయటపడటానికి సచినే కారణమన్నాడు.
సందేశ్ కేరళ బ్లాస్టర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 'ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు సహజం. నా వరకైతే ఐఎస్ఎల్ ఫైనల్లో నా జట్టు కేరళ బ్లాస్టర్స్ ఓడడం తీవ్ర నిరాశ కలిగించింది' అని సందేశ్ పేర్కొన్నాడు.
'ఆ ఓటమితో తీవ్ర నిరాశ, నిస్పృహలోకి కూరుకుపోయిన క్షణంలో నేనున్నానంటూ ఒకరు నా భుజం తట్టారు. అతనెవరో కాదు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్' అని సందేశ్ జింగాన్ తెలిపాడు.

'తన ప్రపంచ కప్ కలను సాకారం చేసుకోవడానికి ఆరుసార్లు అలుపెరగకుండా ప్రయత్నించానని సచిన్ టెండూల్కర్ చెప్పాడు. ఈ ఒక్కమాట నాలో ఎంతో స్ఫూర్తి నింపింది' అని సందేశ్ తెలిపాడు. కలలు కనడం ఆపొద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.
కాగా, కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2018లో జరిగే ప్రపంచ కప్ టోర్నీ ప్రిలిమినరీ క్వాలిఫికేషన్ కోసం భారత జట్టులో సభ్యుడైన జింగాన్ కసరత్తులు చేస్తున్నాడు.