ముంబయి: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శ్రీలంకతో జరిగే ఐదు వన్డేల సిరీస్ నుంచి తప్పుకుంటున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో గాయపడడంతో ఆయన వన్డే సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సచిన్ టెండూల్కర్ స్థానంలో చెన్నైకి చెందిన సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కు వన్డే జట్టులో స్థానం దక్కింది. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బిసిసిఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ ఈ నెల 18వ తేదీనుంచి ప్రారంభమవుతుంది. చామిండా వాస్ ఇచ్చిన క్యాచ్ ను పట్టుకునే ప్రయత్నంలో టెండూల్కర్ గాయపడ్డాడు. దీంతో అతను చాలా సమయం ఫీల్డింగ్ కు దూరంగా ఉన్నాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేశాడు.