హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్,జట్టుకు ఎన్నో సేవలందించారు. అంతేకాదు, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ క్రీడలను ప్రోత్సహించడంలో రిటైర్మెంట్ తర్వాత కూడా పెద్ద ఎత్తులో మద్దతిస్తున్నారు. క్రికెట్ ద్వారా సంపాదించిన కొంత మొత్తంలో సామాజిక సేవకు ఉపయోగించారు. సచిన్ సేవల గురించి ప్రత్యక్షంగా ఏ రోజు మీడియా ముందు ప్రస్తావించలేదు.
బంగ్లాదేశ్ వెళ్లి ఆ దేశ వీల్చైర్ క్రికెట్ జట్టుతో మన వీల్చైర్ క్రికెట్ టీమ్ మూడు మ్యాచ్ల సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ వికలాంగుల జట్టు ఆడేందుకే ప్రోత్సాహాన్ని ఆలస్యంగా అందించిన క్రికెట్ బోర్డు వీల్ చైర్ క్రికెట్ కూడా అదే విధంగా ప్రవర్తించింది. దీంతో టీమిండియాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. బంగ్లాదేశ్ వెళ్లడానికి విమాన టిక్కెట్లు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. వారు ఐసీసీ, బీసీసీఐని సాయం కోసం అభ్యర్థించినా ఫలితంలేదు.
ఈ విషయం సచిన్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆర్థిక సాయం అందించారు. జట్టు మొత్తం బంగ్లాదేశ్ వెళ్లడానికి విమాన టిక్కెట్లను సమకూర్చారు. వాస్తవానికి భారత్లో వీల్చైర్ క్రికెట్ ఆర్గనైజర్ ప్రదీప్ రాజ్ చెప్పేంత వరకు సచిన్ సాయం చేసిన విషయం ఎవరికీ తెలియదు. 2-1 తేడాతో బంగ్లాదేశ్పై గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న భారత వీల్చైర్ జట్టు మే 9న స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్టులో వారికి ఘన స్వాగతం లభించింది.
ఇదిలా ఉంటే, ప్రదీప్ రాజ్ ఆదివారం 'ముంబై మిర్రర్'తో మాట్లాడుతూ సచిన్ చేసిన సాయం గురించి వెల్లడించారు. 'మేం సచిన్కు ఎంతో రుణపడి ఉన్నాం. ఆయనే లేకపోతే మేం బంగ్లాదేశ్ వెళ్లి ఈ సిరీస్ ఆడలేకపోయేవాళ్లం. మా ఇబ్బంది గురించి విన్న వెంటనే సచిన్ సాయం చేశారు. మా పర్యటన ఆగిపోకుండా ఆ సాయం కాపాడింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి ఇది మాకు స్ఫూర్తి' అని ప్రదీప్ చెప్పారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి, బీసీసీఐని సాయం కోరినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించారు. పర్యటనకు వెళ్లడానికి ముందు తమ జట్టు సభ్యులతో టెండూల్కర్ మాట్లాడారని, అది వారికి మరింత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందన్నారు. కాగా, వీల్చైర్ క్రికెట్ కూడా సాధారణ క్రికెట్లానే ఉంటుంది. కాకపోతే వీల్చైర్ క్రికెట్లో బౌండరీ దూరం 45 మీటర్లు మాత్రమే ఉంటుంది.