
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ఐసీసీ ర్యాంకుల్లో కోహ్లీ అత్యధిక అవార్డులను గెలుచుకున్నాడు. ఈ విషయంపై దిగ్గజ ఆటగాడు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఈ మేరకు గురువారం ఐసీసీ అవార్డుల ప్రకటించిన తరువాత సచిన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కోహ్లికి అభినందలు తెలియజేశాడు. ' ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నీకు అర్హత ఉంది కాబట్టే సదరు అవార్డును గెలుచుకున్నావ్. నీకు అనేకమైన అభినందనలు' అని సచిన్ ట్వీట్ చేశాడు.
ప్రపంచ క్రికెట్లో దూసుకుపోతున్న కోహ్లి పలు ఐసీసీ ప్రధాన అవార్డులను గెలుచుకోవడంలో ఆశ్చర్యపోవాల్సి ఏమీ లేదంటూ సచిన్ ప్రశంసించాడు. ఆ అవార్డులను గెలుచుకోవడానికి విరాట్ అన్ని విధాల అర్హుడన్నాడు.
2017 సంవత్సరానికి గాను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కోహ్లి దక్కించుకున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్గా కూడా కోహ్లి ఎంపికయ్యాడు. మరొకవైపు విశేషమైన టాలెంట్ ఉన్న క్రికెటర్ల గౌరవ సూచకంగా ఇచ్చే ఐసీసీ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని సైతం కోహ్లి గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.