
హైదరాబాద్: తెలంగాణ క్రికెట్ సంఘానికి (టీసీఏ) సభ్యత్వం ఇచ్చే విషయంలో బీసీసీఐ సానుకూలంగా స్పందిస్తున్నదని టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు బోర్డు సీఈవో రాహుల్ జోహ్రీతో సమావేశం అయినట్టు చెప్పారు. జోహ్రీ ఆహ్వానం మేరకు ముంబైలోని బోర్డు ప్రధాన క్యారాలయంలో బుధవారం ఆయనతో భేటీ అయినట్టు చెప్పారు.
ఈ సమావేశంలో సభ్యత్వ ప్రక్రియను మొదలుపెట్టే విషయంపై చర్చించినట్టు తెలిపారు. 'మా దరఖాస్తు పరిశీలనలో ఉన్నదని జోహ్రీ చెప్పారు. ఈ విషయంపై బోర్డు పాలక మండలి (సీవోఏ)తో చర్చిస్తానని, త్వరలో జరిగే అడ్మినిస్ట్రేటర్ల సమావేశం అజెండాలోనూ ఉండేలా చూస్తానని హామీ ఇచ్చార'ని తెలిపారు.
తెలంగాణ క్రికెట్లో ముఖ్యంగా హెచ్సీఏలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బీసీసీఐ పరిశీలిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో టీసీఏకు అనుబంధ లేదా శాశ్వత సభ్యత్వం ఇచ్చే అంశాన్ని రాబోయే సమావేశాల్లో బీసీసీఐ తేల్చనుందని చెప్పారు. గత మూడేళ్ల నుంచి తెలంగాణ జిల్లాల క్రికెటర్ల కోసం టీసీఏ చేస్తున్న కృషిని బోర్డు గుర్తించిందన్నారు.
హెచ్సీఏలో నెలకొన్న గందరగోళ పరిస్థితులతో క్రికెట్కు నష్టం కలిగిందని సీఈవో కూడా అంగీకరించారని గురువారెడ్డి చెప్పారు. తమ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన బీసీసీఐకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో గురువారెడ్డితో పాటు టీసీఏ సభ్యులు అంబర్ అబ్బాస్, జైపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.