గుజరాత్కు చెందిన 18 ఏళ్ల కుర్రాడు ద్రోణ దేశాయ్ సంచలనం నమోదుచేశాడు. 498 పరుగుల అద్భుత ఇన్నింగ్స్తో రికార్డుల బుక్లో తన పేరు లిఖించుకున్నాడు. దివాన్ బల్లూబాయ్ అండర్ 19 మల్టీడే టోర్నమెంట్లో తన సెయింట్ జేవియర్స్ స్కూల్ తరఫున బరిలోకి దిగిన ద్రోణ.. జేఎల్ ఇంగ్లిష్ స్కూల్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.
ఈ టోర్నమెంట్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ క్రికెట్ అహ్మదాబాద్ నిర్వహిస్తోంది. ఈ బోర్డు గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ కింద పనిచేస్తుంది. అయితే 500 పరుగుల మార్క్ను తృటిలో కోల్పోయిన ద్రోణ తన పేరిట అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్లో అత్యధిక పరుగుల సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానం దక్కించుకున్నాడు.

ఓ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ప్రణవ్ ధన్వాడే (1009 పరుగులు, నాటౌట్), పృథ్వీ షా (546),డా. హవేవాలా (515), చమన్లాల్ (506 పరుగులు, నాటౌట్), ఆరమన్ జాఫర్ (498) టాప్-5లో ఉన్నారు. అయితే 500 మార్క్ మిస్ అవ్వడంపై ద్రోణ నిరాశ వ్యక్తం చేశాడు. మైదానంలో స్కోరుబోర్డు లేకపోవడంతో మైలురాయికి చేరువలో ఉన్నట్లు తెలియలేదని తెలిపాడు.
''మైదానంలో స్కోరుబోర్డు లేదు. మా జట్టు కూడా నేను 498 పరుగుల వద్ద ఉన్నానని చెప్పలేదు. స్ట్రోక్కు యత్నించి ఔటయ్యాను. అయితే ఓవరాల్గా ఇన్ని పరుగులు సాధించినందుకు సంతోషంగా ఉంది'' అని ద్రోణ దేశాయ్ అన్నాడు. ద్రోణ 320 బంతుల్లో 498 పరుగులు చేశాడు. ఏడు సిక్సర్లు, 86 ఫోర్లు బాదాడు. కాగా, ఈ మ్యాచ్లో సెయింట్ జేవియర్స్ ఇన్నింగ్స్ 712 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్లో సెయింట్ జేవియర్స్ పది మంది ప్లేయర్లతోనే ఆడటం గమనార్హం. ఓ ఆటగాడు ఆలస్యంగా రావడంతో 10 మందితోనే మ్యాచ్ను ఆడారు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ద్రోణ గుజరాత్ అండర్-14 జట్టుకు ఆడాడు. ఈ ఇన్నింగ్స్లో గుజరాత్ అండర్-19 జట్టులో చోటు దక్కుతుందని ఆశిస్తున్నాడు.