హైదరాబాద్: ఐపీఎల్ 10వ ఎడిషన్ కోసం సోమవారం (ఫిబ్రవరి 20) బెంగుళూరులో నిర్వహించిన వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ తనను కోనుగోలు చేయడం పట్ల ఆప్ఘనిస్థాన్కు చెందిన మహ్మద్ నబీ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో అసోసియేట్ దేశంగా ఉన్న ఆప్ఘనిస్థాన్కు చెందిన ఐదుగురు కొత్త ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు.
వీరిలో మహ్మద్ నబీని రూ. 30లక్షలకు, రషీద్ ఖాన్ను రూ. 4 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. తొలుత వేలంలో మహ్మద్ నబీని కొనుగోలు చేయడంతో ఆప్ఘనిస్థాన్ తరుపున ఐపీఎల్లో చోటు దక్కించుకున్న మొదటి ఆటగాడిగా నబీ చరిత్ర సృష్టించాడు.

ఈ నేపథ్యంలో నబీ మీడియాతో మాట్లాడాడు. 'నా జీవితంలో ఇది మరపురాని రోజు' అని పేర్కొన్నాడు. సన్ రైజర్స్ జట్టు తనని కొనుగోలు చేసిందని తెలుసుకోగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని, ఐపీఎల్లో ఆడాలనేది తన కల అని, ఇన్నాళ్లకు అది నిజమైందని సంతోషం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది. 'హరారేలోని ఓ హోటల్ గదిలో సోమవారం ఉదయం ప్రార్థన ముగించుకుని టీవీలో ఐపీఎల్ వేలం చూస్తున్నాను. నా పేరు వినపడగానే ఎంతో ఉద్విగ్నంగా ఫీలయ్యాను. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ షఫిక్ మొదట నన్ను అభినందించారు' అని నబీ చెప్పాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేది ప్రపంచంలోని అత్యుత్తమ టీ20లీగ్ అని, సన్ రైజర్స్ హైదరాబాద్ తనను కొనుగోలు చేయడం ద్వారా డేవిడ్ వార్నర్, వీవీఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్, కేన్ విలియమ్సన్, యువరాజ్సింగ్, జోర్దాన్ లాంటి క్రికెటర్లను కలుసుకునే అవకాశం తనకు లభించిందని తెలిపాడు.