కోహ్లీసేన చేజారిన నెం.1 టెస్టు ర్యాంక్
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా (116 రేటింగ్), న్యూజిలాండ్ (115), భారత్ (114) జట్లు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు జట్ల మధ్య అంతరం కేవలం ఒక పాయింటే. గతంలో 2016 జనవరిలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ఇలా ఒక పాయింట్ అంతరం ఉండేది. తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్ (105), శ్రీలంక (91), దక్షిణాఫ్రికా (90), పాకిస్థాన్ (86), వెస్టిండీస్ (79), అఫ్గానిస్థాన్ (59), బంగ్లాదేశ్ (55) జట్లు వరుసగా ఉన్నాయి.
2016 అక్టోబర్ నుంచి టెస్టుల్లో అగ్రస్థానం
కోహ్లీసేన 2016 అక్టోబర్ నుంచి టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా 2016-17లో సాధించిన 12 టెస్టు విజయాలు, ఒక ఓటమిని తాజా ర్యాంకింగ్స్లో పరిగణనలోకి తీసుకోకపోవడంతో నంబర్వన్ ర్యాంకు చేజారింది. ఆ కాలంలో టీమిండియా ఆడిన ఐదు సిరీసులనూ కైవసం చేసుకుంది. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పైనా విజయాలున్నాయి. అదే సమయంలో దక్షిణాఫ్రికా, టీమిండియా చేతిలో ఆసీస్ ఓటమి పాలైంది. గత ఏడాది ఆగస్టు నుంచి 9 టెస్టులాడిన టీమిండియా 7 గెలిచి.. 2 ఓడింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నది.
టీ20ల్లో ఆసీస్ తొలిసారిగా:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ను వెనక్కి నెట్టిన ఆస్ట్రేలియా.. తొలిసారి ఈ ఫార్మాట్లో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ ఓ స్థానం మెరుగుపచుకొని మూడో ర్యాంకుకు చేరుకోగా.. ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ ఏకంగా అగ్రస్థానం నుంచి నాలుగో ర్యాంకుకు పడిపోవడం ఇక్కడ విశేషం.
వన్డేల్లో రెండో ర్యాంకు:
మరోవైపు ఐసీసీ శుక్రవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో భారత్ రెండో ర్యాంకును నిలబెట్టుకుంది. అగ్రస్థానంలో ఇంగ్లండ్ కొనసాగుతున్నది. మూడో ర్యాంకులో న్యూజిలాండ్ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు వరుసగా ఉన్నాయి.