మరో రెండు మూడు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం జట్లను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో 417 రోజులుగా జట్టుకు దూరంగా ఓ స్టార్ ప్లేయర్ పై బీసీసీఐ సెలక్టర్లు కన్నేశారని తెలిసిందే. అతడిని ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఎంపిక చేస్తారని సమాచారం అందింది. పూర్తి వివరాలు కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం.
గాయం నుంచి కోలుకున్న టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. చివరిగా వన్డే వరల్డ్ కప్ 2023లో ఆడాడు. కానీ ఈ మెగా టోర్నీలో చీలమండ గాయమవ్వడం వల్ల లండన్ కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత కోలుకున్న అతడు జాతీయ జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. దీని కోసం ఫిట్నెస్ సాధించి దేశవాళీ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు.

పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడబోయే దేశాలు తమ జట్లను ప్రకటించడానికి జనవరి 12 వరకే డెడ్ లైన్ ఉంది. ఈ లోగా తమ జట్ల ఆటగాళ్ల జాబితాను ఆయా దేశాలు వెల్లడించాల్సి ఉంది. జట్టు ఎంపికకు సమయం దగ్గర పడడం వల్ల, టీమ్ ఇండియాకు ఎంపికయ్యే ఆటగాళ్లు ఎవరనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో ఎక్కువైంది.
ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై గత కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీపై పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బీసీసీఐ వైద్యుల బృందం అతడిని నిశితంగా పరిశీలిస్తోందని తెలిసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో అతడిని ఆడించాలని కూడా బీసీసీఐ భావిస్తోందట. దాదాపుగా ఈ సిరీస్ తో షమీ జాతీయ జట్టులోకి కమ్ బ్యాక్ ఇస్తాడని ఇంగ్లీష్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగ్ పుర్ లో జరగనుంది. ఈ మ్యాచ్ తోనే అతడు భారత జట్టుతో కలుస్తాడని సమాచారం.