రీసెంట్ గా ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ ఐదో మ్యాచ్ లో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ వేలికి గాయమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడు సర్జరీ చేయించుకున్నాడు. దీంతో అతడు త్వరలోనే ప్రారంభం కానున్న ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉంది? ఇంతకీ అతడు ఐపీఎల్ కు అందుబాటులో ఉంటాడా? లేదా? తెలుసుకుందాం.
త్వరగా కోలుకోండి కెప్టెన్..
మరో వారం రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి అతడు ఎంపిక కాలేదు. దీంతో ఇప్పుడు అతడు తన నెక్ట్స్ టార్గెట్ ఐపీఎల్ పై పెట్టాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ నాటికి గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్ నెస్ సాధించాలని రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా తాజాగా అతడు సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం బుధవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలిపింది. సంజు శాంసన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంది. "త్వరగా కోలుకోండి, కెప్టెన్" అని హార్ట్ ఎమోజీని క్యాప్షన్ గా రాసుకొచ్చింది.

మరో నెల రోజుల్లో..
అయితే శాంసన్.. మరో నెలలో పూర్తిగా కోలుకుంటాడని తెలిసింది. ఐపీఎల్ 2025 ప్రారంభం నాటికి ఫిట్ గా ఉంటాడని సమాచారం అందింది. "శాంసన్ సర్జరీ పూర్తైంది. మరో నెలలో అతడు రికవరీ అవుతాడు. మార్చిలో చివర్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం అతడు సిద్ధమయ్యేందుకు కావాల్సినంత సమయం ఉంది." అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.