ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి వన్డే మ్యాచ్ కోసం ఇప్పటికే సపోర్టింగ్ స్టాఫ్ తో కలిసి టీమిండియా నాగ్ పూర్ చేరుకుంది. అయితే వీళ్లంతా తమకు కేటాయించిన హోటల్ రూమ్స్ లోకి వెళ్లేముందు ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు.. సపోర్టింగ్ స్టాఫ్ లోని ఓ కీలక సభ్యుడిని లోపలికి వెళ్లనివ్వకుండా కాసేపు అడ్డగించారు. లోపలికి ప్రవేశం లేదంటూ అతడిని పంపించేందుకు నిరాకరించారు.
ఎందుకంటే?
టీమిండియా ప్లేయర్స్ అంతా తమ సపోర్టింగ్ స్టాఫ్ తో కలిసి నాగ్ పూర్ లోని హోటల్ కు బస్ లో చేరుకున్నారు. అయితే అంతా బస్ దిగి తమ లగేజ్ లతో హోటల్ లోకి వెళ్తోన్న సమయంలో.. రఘు అనే సపోర్టింగ్ స్టాఫ్ సభ్యుడు మాత్రం బస్ వెనక నుంచి లగేజ్ తీసుకుని వచ్చి జట్టుతో కలిసేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడికి బందోబస్త్ కు వచ్చిన పోలీసులు.. అతడిని బయట వ్యక్తిగా భావించి అడ్డుకున్నారు. అతడు సపోర్టింగ్ స్టాఫ్ లోని సభ్యుడు అని తెలీక లోపలికి వెళ్లకూడదని కాసేపు వాదించారు. వెంటనే స్పందించిన ఇతర కోచింగ్ స్టాఫ్.. రఘ మా టీమ్ లోకి వ్యక్తేనంటూ పోలీసులకు చెప్పారు. దీంతో అధికారులు రఘకు రూట్ క్లియరెన్స్ ఇచ్చారు. అతడు లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.

రఘు ఎవరంటే?
గత దశాబ్ద కాలంగా రఘు.. సపోర్టింగ్ స్టాఫ్ లో కీలక సభ్యుడిగా, త్రోడౌన్ స్పషలిస్ట్ గా రాణిస్తున్నాడు. ఆ మధ్య మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కూడా.. టీమిండియాకు రఘు అందిస్తోన్న సేవలకుగానూ ప్రశంసలు కురిపించాడు. రఘు కర్ణాటకు చెందిన వ్యక్తి. చిన్నప్పుడు నుంచే క్రికెట్ పై మక్కువ ఉండడంతో ఇంటిని వదిలేసి క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు.
కానీ అతడికి కుటుంబం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందలేదు. ఇంటి నుంచి వచ్చేసిన తొలినాళ్లలో అతడు బస్ స్టాండ్, గుడిలో పడుకునేవాడు. ఆ తర్వాత గ్రేడ్ క్రికెట్ లో అతడి ప్రదర్శనను గుర్తించిన కర్ణాటక క్రికెట్ సంఘం అకామడేషన్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత చేతికి గాయమవ్వడంతో అతడి క్రికెట్ కెరీర్ ముగిసింది. దీంతో అతడు కోచింగ్ విభాగంలోకి వెళ్లిపోయాడు.