టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ముంబయి రంజీ టీమ్ తో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమయ్యాడు.
మంగళవారం ఆ జట్టు ప్రాక్టీస్ సెషన్కు రోహిత్ హాజరయ్యాడు. పేలవ ఫామ్ కారణంగా హిట్ మ్యాన్ ను జట్టు నుంచి తప్పించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అతడు ముంబయి రంజీ జట్టుతో కలిశాడు.
ఇటీవలే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విఫలమైన భారత జట్టు.. నెక్ట్స్ ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. అయితే వన్డే సిరీస్.. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు అత్యంత కీలకంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన నేపథ్యంలో కచ్చితంగా సత్తా చాటాల్సిన పరిస్థితి అతడికి ఎదురైంది.

ఈ క్రమంలోనే ఫామ్ను అందిపుచ్చుకోవడానికి రోహిత్ శర్మ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే అతడు రంజీ ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23 నుంచి ఆరంభం కానున్న రంజీ మ్యాచుల్లో ముంబయి జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడట.
రంజీ ట్రోఫీ బరిలో దిగేందుకు.. వాంఖడేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేడియాల్లో వారం రోజుల పాటు ముంబయి జట్టు ప్రాక్టీస్ చేయనుంది. ఆ జట్టుతోనే కలిసి హిట్ మ్యాన్ ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటానని అధికారికంగా తమకు సమాచారం ఇచ్చినట్లు ముంబయి క్రికెట్ సంఘానికి చెందిన ఓ అధికారి చెప్పాడు. అందులో భాగంగానే నేడు వాంఖడే స్టేడియంలో నెట్స్కు హాజరయ్యాడు హిట్ మ్యాన్. ఇంకా ఈ ప్రాక్టీస్ సెషన్ లో అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ కూడా ప్రాక్టీస్లో పాల్గొనబోతోన్నట్లు తెలిసింది.
కాగా, రంజీ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్లో జమ్ముకశ్మీర్తో తలపడనుంది ముంబయి. చూడాలి మరి ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనేది.
🚨 Breaking @ImRo45 turning up for the practice session at Wankhede pic.twitter.com/F4gyBnhDEO
— RevSportz Global (@RevSportzGlobal) January 14, 2025