ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఓ ఎదురుదెబ్బ తగిలింది. తండ్రి మరణంతో ఓ టీమిండియా మెంబర్ స్వదేశానికి తిరిగొచ్చాడు. దీంతో పలువురు క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు అతడి కటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది?, జట్టును ఎవరు వీడారంటే?
దుబాయ్ వీడిన బౌలింగ్ కోచ్..
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే టీమిండియా దుబాయ్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ సెషన్ కూడా ప్రారంభించింది. అయితే తాజాగా భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వ్యక్తిగత కారణాలతో దుబాయ్ వీడినట్లు తెలిసింది. మొదట పలు ట్రైనింగ్ సెషన్లలోనూ పాల్గొన్న మోర్నీ మోర్కెల్.. సోమవారం మాత్రం ప్రాక్టీస్ సెషన్కు హాజరు కాలేదు. దీంతో అతడు అనివార్య కారణాలతో జట్టును వీడినట్లు వార్తలు వచ్చాయి.

తండ్రి మరణంతో..
కానీ ఆ తర్వాత తన తండ్రి మరణంతో మోర్నీ మోర్కెల్ దుబాయ్ నుంచి స్వదేశానికి పయనమైనట్లు సమాచారం అందింది. అయితే అతడు తిరిగి ఎప్పుడు వస్తాడనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ప్రస్తుతం మోర్నీ మోర్కెల్ జట్టుతో లేకపోవడం.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు లోటేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బంగ్లాదేశ్ తో ప్రారంభం..
డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్థాన్ - న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ తో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న టీమిండియా.. బంగ్లాదేశ్తో తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. మార్చి 9 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది.