
హైదరాబాద్: అసలు ప్రణాళికే లేకుండా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చింది. శ్రీలంకతో టీ 20 మ్యాచ్ అనంతరం కొద్ది పాటి విరామంతోనే బయల్దేరాల్సి వచ్చింది. అంటూ భారత జట్టు మేనేజ్మెంట్ సభ్యుల్లో ఒకరు బీసీసీఐ మీదకు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదని, సిరీస్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే అక్కడికి చేరుకోవాల్సి ఉండగా శ్రీలంకతో బిజీ షెడ్యూల్ కారణంగా భారత జట్టు వెళ్లలేకపోయిందని వివరించాడు.
వన్డే, టీ20లు ఆడని ఆటగాళ్లను ముందుగా దక్షిణాఫ్రికా పంపుతామని బీసీసీఐ చెప్పిందంటూ దానికి టీమ్ మేనేజ్మెంటే వద్దందని కొద్ది రోజుల ముందే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయానికి సంబందించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. సఫారీ పర్యటనకు ముందుగానే వెళ్లేందుకు టీమిండియా మేనేజ్మెంట్, కోహ్లీసేన లంకతో టీ20 సిరీస్ను రద్దు చేయమని బీసీసీఐని కోరిందంట.
కుదరని పక్షంలో టెస్టు సిరీస్ను రద్దు చేసి దానికి బదులు ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడేలా షెడ్యూల్ను మార్చాలని సూచించిందంట. ఇలా చేస్తే ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి లభించడంతో పాటు ముందుగానే దక్షిణాఫ్రికా వెళ్లొచ్చని వాళ్ల అభిప్రాయం. అయితే ఈ ప్రతిపాదనతో ఏకీభవించని బీసీసీఐ యథావిధిగా షెడ్యూల్ను కొనసాగించింది. దీంతో లంకతో నవంబరు 11న ప్రారంభమైన షెడ్యూల్ డిసెంబరు 24 వరకు కొనసాగింది.
ఆ తర్వాత 27వ తేదీకి కోహ్లీ సేన సఫారీ పర్యటనకు బయల్దేరింది. 'జట్టంతా ముందే వెళ్తామని బీసీసీఐని కోరితే రహానె, పుజారాను ముందే పంపుతామని బీసీసీఐ అనడంలో అర్ధం లేదు.' అని దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా మేనేజ్మెంట్ సభ్యుల్లో ఒకరు తెలిపారు. కేప్టౌన్, సెంచూరియన్ టెస్టుల్లో టీమిండియా పరాజయం పాలై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ను చేజార్చకుంది. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు ఈ నెల 24న ప్రారంభంకానుంది. చివరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత్ కసరత్తులు చేస్తోంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.