దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ దూరం కానున్నాడు. బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన తన తండ్రి లోకేంద్ర సింగ్ చాహర్ బాగోగులు చూసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లకు చెప్పానని దీపక్ చాహర్ తెలిపాడు. తనని క్రికెటర్ గా తీర్చిదిద్దిన తన తండ్రిని ఈ స్థితిలో వదిలి వెళ్లలేని భావోద్వేగానికి గురయ్యాడు.
''మా నాన్న లోకేంద్ర సింగ్ చాహర్ ను సకాలంలో ఆస్పుత్రిలో చేర్చాం. లేకుంటే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండేది. ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే ఆస్ట్రేలియాతో చివరి టీ20 మ్యాచ్ ఎందుకు ఆడలేదని ఎంతోమంది అడిగారు. మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం. క్రికెటర్ గా నన్ను ఆయనే తీర్చిదిద్దాడు. ఇలాంటి స్థితిలో ఆయన్ని వదిలి వెళ్లలేను. పూర్తిగా కోలుకునే వరకు ఆయనతోనే ఉండాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్తాను. ఈ విషయాన్ని కోచ్ ద్రవిడ్, సెలక్టర్లకు చెప్పాను'' అని దీపక్ చాహర్ వివరించాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20కు ముందు దీపక్ చాహర్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దీపక్ అందుబాటులో లేడని టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. నాలుగో టీ20లో దీపక్ రెండు కీలక వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.
అయితే దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్ లకు ఎంపికైన దీపక్ చాహర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. బంతిని స్వింగ్ చేయగలిగే సత్తా ఉన్న అతడు జట్టులో ఎంతో కీలకం. అతడు పర్యటనకు పూర్తిగా దూరమైతే చాహర్ స్థానంలో మరో పేసర్ ను తీసుకుంటారా లేదా వన్డేలకు మాత్రమే ఎంపికైన ఆవేశ్ ఖాన్ ను టీ20ల్లో కూడా అవకాశం కల్పిస్తారా లేదా చూడాలి.
సౌతాఫ్రికాతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 10న భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.