ముంబై: జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గురువారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో.. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యంలో మరో భారత జట్టు లంకకు వెళ్లనుంది. ఐపీఎల్, దేశవాలీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు శ్రీలంక పర్యటనలో బీసీసీఐ సెలెక్టర్లు చోటు కల్పించారు. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్, నితీష్ రాణాలు తొలిసారి భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో లంక పర్యటన కోసం వెళ్లే భారత ఆటగాళ్లంతా ముందుగా 14 రోజుల క్వారంటైన్లో ఉండనున్నారు. ఇందుకోసం జూన్ 14న ప్లేయర్స్ అందరూ సమావేశమై.. అదే రోజున నిర్బంధంలోకి వెళ్లనున్నారు. ముంబైలోని ఓ హోటల్లో 14 రోజులు క్వారంటైన్ తర్వాత అక్కడి నుంచి స్పెషల్ ప్లైట్లో శ్రీలంకకి వెళ్లనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కెప్టెన్గా శిఖర్ ధావన్ని ఎంపిక చేసిన భారత సెలెక్టర్లు.. వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్కి అప్పగించారు.
'యువరాజ్.. నా కొడుకు కెరీర్ ముగించినందుకు చాలా థాంక్యూ'
'లంక పర్యటన వెళ్లే ఆటగాళ్లు సోమవారం సమావేశమై.. రెగ్యులర్ టెస్టులు చేయించుకుని 14 రోజుల నిర్బంధంలోకి వెళ్లనున్నారు. మొదటి ఏడు రోజులు కఠిన క్వారంటైన్, తర్వాతి ఏడు రోజులు సాఫ్ట్ క్వారంటైన్లో(ఇండోర్ ట్రైనింగ్) ఉంటారు. ఆ తర్వాత కొలొంబోకు బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక శిక్షణకు ముందు మళ్లీ మూడు రోజుల పాటు.. జులై 4 వరకు హార్డ్ క్వారంటైన్లో ఉంటారు. అనంతరం జులై 12వరకు బయోబబుల్లో ట్రైనింగ్ అవుతారు. ఆపై ఇంట్రా స్క్వాడ్ గేమ్స్ ఆడతారు' అని బీసీసీఐ అధికారి తెలిపారు.
పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభానికి ముందు 'లంక ఏ' జట్టుతో వార్మప్ మ్యాచ్లు ఆడటానికి శ్రీలంక క్రికెట్ బోర్డు అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మన ఆటగాళ్లు రెండు బృందాలుగా విడిపోయి ఓ టీ20, రెండు వన్డేల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లు ఆడనున్నారు. ఇరు జట్లు మూడు వన్డేలు (జులై 13, 16, 18), మూడు టీ20లు (21, 23, 25)వ తేదీల్లో ఆడనున్నాయి. సిరీస్లోని అన్ని మ్యాచ్లూ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్నాయి. వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం 2.30 గంటలకి ప్రారంభంకానుండగా.. టీ20లు రాత్రి 7 గంటలకి స్టార్ట్ అవుతాయి.
లంక టూర్కి భారత జట్టు:
శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యుజ్వేందర్ చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.