హైదరాబాద్: ఈ ఏడాది జూన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ సేన ఆడాలని టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపాడు. ఆదాయ పంపిణీ విషయంలో ఐసీసీ, బీసీసీఐకి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడాలా వద్దా? అనే విషయంపై బీసీసీఐ తర్జన భర్జన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మే 7వ తేదీన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

ఈ నేపథ్యంలో బీసీసీఐని ఉద్దేశించి టీమిండియా హెడ్ కోచ్ అనీల్ కుంబ్లే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో పాల్గొనబోయే మిగతా ఏడు దేశాలూ తమ జట్లను ప్రకటించగా, బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం మంగళవారం (ఏప్రిల్ 25) లోపే జట్లను ప్రకటించాలి.
కానీ బీసీసీఐ మాత్రం ఇంకా జట్టుని ప్రకటించలేదు. బీసీసీఐకి, ఐసీసీకి మధ్య నడుస్తోన్న వివాదం ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పొల్గొనడంపై ప్రభావం చూపకూడదని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్స్ టోర్నీలో ఆడాలని కోహ్లీ సేన కోరుకుంటున్నట్టు అనిల్ కుంబ్లే తెలిపారు.
ఇదిలా ఉంటే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం మంచిదని అంతకుముందు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూట్కర్, రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టుని వెంటనే ప్రకటించాలని గురువారం బీసీసీఐని పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఆదేశించింది.
'ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టుని ప్రకటించేందుకు ఏప్రిల్ 25 వరకు గడువు ఉండగా ఇప్పటి వరకు ఎందుకు జట్టును ఎంపిక చేయలేదు' అని సీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరిని సీఓఏ ప్రశ్నించింది. వెంటనే సెలక్షన్ కమిటీతో సమావేశం ఏర్పాటు చేసిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుని వెంటనే ప్రకటించాలని అమితాబ్ చౌదరిని కమిటీ కోరింది.
జూన్ ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంగ్లాండ్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే.