Team India Vice Captaincy: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ఆగస్టు 19న ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ 15 మంది సభ్యుల జట్టులోకి శుభ్మన్ గిల్ తిరిగి వచ్చాడు. ఆసియా కప్ జట్టులో శుభ్మన్ గిల్ను వైస్-కెప్టెన్గా నియమించారు. దీంతో గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన అక్షర్ పటేల్ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు.
గతేడాది కాలంగా భారత క్రికెట్లో వైస్ కెప్టెన్ బాధ్యతలపై జరుగుతున్న ఈ మార్పులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా నుంచి వైస్-కెప్టెన్సీని తొలగించి.. శ్రీలంక పర్యటనకు శుభ్మన్ గిల్ను నియమించారు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో జింబాబ్వే పర్యటనలో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు.

ఆ తర్వాత శుభ్మన్ గిల్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లకు దూరంగా ఉండడంతో.. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో అక్షర్ పటేల్ వైస్-కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్ కెప్టెన్గా రాణించిన శుభ్మన్ గిల్కు మళ్లీ టీ20 జట్టులో చోటుతో పాటు వైస్-కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.
ఇలా తరచూ జరిగే మార్పులు టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్ల ఆలోచనపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి ఆటగాళ్ల నుంచి ఇంత త్వరగా బాధ్యతలు ఎందుకు లాగేసుకుంటున్నారనేది ప్రధాన ప్రశ్నగా మారింది. భారత క్రికెట్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రస్తుత హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. 2012లో ఆస్ట్రేలియాలో ట్రై-సిరీస్లో భారత జట్టు ఫైనల్కు చేరుకోలేకపోవడంతో గంభీర్ నుంచి వైస్-కెప్టెన్సీని తొలగించి విరాట్ కోహ్లీకి ఆ బాధ్యతలు అప్పగించారు.
ఈ సంఘటన గురించి గౌతమ్ గంభీర్ ఓ ఇంటర్వ్యూలో తన బాధను వెల్లడించారు. ఆ సిరీస్లో తాను భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడినని, అయినప్పటికీ తనను వైస్-కెప్టెన్సీ నుంచి తొలగించారని ఆయన చెప్పారు. అయితే కెప్టెన్గా ధోని కొనసాగారని, కానీ వైస్-కెప్టెన్ను మార్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ నిర్ణయం సెలెక్టర్లదని కోచ్ డంకన్ ఫ్లెచర్ చెప్పారని, తన కెరీర్లో ఎప్పుడూ సెలెక్టర్లకు ఫోన్ చేయలేదని, తన గౌరవం తనకు ముఖ్యమని గంభీర్ స్పష్టం చేశారు. ఆ సిరీస్లో గంభీర్ 7 మ్యాచ్లలో 44 సగటుతో 308 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు గంభీర్. ఆ సిరీస్లో కోహ్లీ 8 మ్యాచ్లలో 373 పరుగులు చేశాడు.
ముక్కోణపు-సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, వైస్-కెప్టెన్సీని కోల్పోవడంతో గంభీర్ నిరాశ చెందాడు. ఆ తర్వాత అదే ఏడాది తన సారథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)ను తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపి తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఆ ఫైనల్లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను ఓడించడం గమనార్హం.