షమీకి బ్రేక్
రెండో వన్డేలో కివీస్ పతనాన్ని శాసించిన వెటరన్ పేసర్ మహమ్మద్ షమీకి మూడో వన్డేలో విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందట. అతని స్థానంలో తొలి రెండు వన్డేల్లో అవకాశం దక్కని జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ను మూడో వన్డేలో తీసుకుంటారని సమాచారం. తొలి రెండు వన్డేల్లో ఉమ్రాన్ను తీసుకోకపోవడం ఫ్యాన్స్కు ఏమాత్రం రుచించలేదు. శ్రీలంకపై అద్భుతంగా ఆడిన అతనికి కివీస్పై కూడా సత్తా చాటే ఛాన్స్ ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
హార్దిక్ స్థానంలో..
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్పై బీసీసీఐ ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు పాండ్యా చాలా కీలకం. అతను కివీస్తో టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. దీంతో అతనికి మూడో వన్డేలో విశ్రాంతినివ్వాలని టీమిండియా భావిస్తోంది. అతని స్థానంలో బెంగాల్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్కు అవకాశం ఇస్తారని సమాచారం. బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో పెద్దగా ఆకట్టుకోని షాబాజ్.. కివీస్పై సత్తా చాటాలని ఎదురు చూస్తున్నాడు.
విరాట్ కోహ్లీ ఆడటం లేదా?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని స్పిన్ బౌలింగ్ తెబ ఇబ్బంది పెడుతోంది. కివీస్తో ఆడిన రెండు వన్డేల్లో కూడా మిచెల్ శాంట్నర్ బౌలింగ్లోనే కోహ్లీ అవుటయ్యాడు. దానికితోడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా ఆటగాళ్లు రంజీలు ఆడాలని మాజీలు అంటున్నారు. ముఖ్యంగా రవిశాస్త్రి తన కామెంటరీ సమయంలో కూడా కోహ్లీకి ఇదే సజెషన్ ఇచ్చాడు. నిజంగానే కోహ్లీ కనుక ఢిల్లీ తరఫున రంజీ ఆడాలని డిసైడ్ అయితే.. అతని స్థానంలో రజత్ పటీదార్కు జట్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జడేజా, పుజారా రంజీలు ఆడుతున్నారు. దీంతో కోహ్లీ కూడా ఇదే పని చేస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పటీదార్ టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడని సమాచారం.