పెర్త్: ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ భారత క్రికెట్ జట్టు ఘన విజయాలు సాధించినప్పటికీ ఓ సమస్య మాత్రం తీరడం లేదు. తొలుత బ్యాటింగ్ను చేపట్టి భారీ లక్ష్యాలను ప్రత్యర్థులకు నిర్దేశిస్తున్నా ఇన్నింగ్స్ చివరలో తడబాటు మాత్రం తగ్గడం లేదు. చివరి బ్యాట్స్మెన్ పరుగులను రాబట్టడంలో తడబడి వికెట్లను చేజార్చుకుంటున్నారు. తదుపరి మ్యాచుల్లో ఇది తీవ్రమైన సమస్యగా మారినా ఆశ్చర్యం లేదు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏదైనా మ్యాచులో విఫలమైతే చివరి బ్యాట్స్మెన్ నిలబడి ఇన్నింగ్సును నిర్మిస్తారనే నమ్మకం లేకుండా పోయింది.
బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ వంటి అన్ని విభాగాల్లోనూ టీమిండియా పటిష్టంగా తయారైనట్లు కనిపిస్తోంది. ఆల్రౌండ్ ప్రదర్శనలతో విజయాలను అందుకుంటున్నా జట్టులో చివరి బ్యాట్స్మెన్ తొలుత బ్యాట్స్మెన్ ఇచ్చిన ఊపును చివరంటా కొనసాగించలేకపోతున్నారు. దాంతో గత రెండు మ్యాచ్ల్లోనూ అటుఇటుగా 330 పరుగుల మార్కును అందుకోవడం ఖాయమనే అంచనాలను తలకిందులు చేస్తూ 300 (పాకిస్థాన్పై), 307 (దక్షిణాఫ్రికా) పరుగులకే పరిమితమైంది.

పాక్తో మ్యాచ్లో కోహ్లీ, రహానేల బ్యాటింగ్ ధాటికి భారత్ 45.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 273 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులే చేసి 5 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో ధావన్, రహానేల ఇన్నింగ్స్తో భారత్ 43.3 ఓవర్లలో 2 వికెట్లకు 261 పరుగులు సాధించింది. అయితే 48.5 ఓవర్లకొచ్చేసరికి 41 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమస్యను అధిగమించాల్సిన అవసరం భారత జట్టుకు ఉంది.
ఈ సమస్య భారత్దే కాదని, అన్ని జట్లకూ ఉందని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సమర్థించుకున్నారు. చివరి వికెట్ బ్యాట్స్మన్కు పేస్ బౌలింగ్లో బ్యాటింగ్ చేయాలంటే కష్టమేనని, బ్యాటింగ్ స్పెషలిస్ట్లనైతే దూకుడుగా ఆడమని చెప్పగలమని అన్నాడు. కానీ అశ్విన్, షమీ లాంటి వాళ్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓవర్కు 8,9,10 పరుగులు ఆశించకూడదని చెప్పారు. గ్రూప్ దశ ముగిసేలోపు పరిస్థితులపై అంచనాకొచ్చి భారీ స్కోర్లు సాధించేందుకు కృషి చేస్తాం అని ధోనీ అన్నాడు.