భారత దేశం 77వ స్వతంద్ర దినోత్సవం జరుపుకుంటోంది. భారత క్రికెటర్లు కూడా ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. రాంచీలోని తన ఫాం హౌస్లో జాతీయ జెండాను ఎగరేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాడు. అలాగే టీమిండియా మాజీ ఓపెనర్, ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా జాతీయ జెండాను ఎగరేశాడు.
ఈ సందర్భంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. 'ఐ లవ్ మై ఇండియా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా తోటీ భారతీయులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు. టీమిండయా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఎక్స్లో ట్వీట్ చేశాడు.

'త్రివర్ణ పతాకాన్ని మాటల్లో వర్ణించలేం. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే' అని పోస్టు పెట్టాడు. విరాట్ కోహ్లీ కూడా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. గంభీర్ తన ఇన్స్టాలో జాతీయ పతాకం ఎగరేస్తున్న వీడియో షేర్ చేశాడు. దానికి 'ప్రేమంటే నాకు తెలీదు. కానీ నీపై ఉన్న ప్రేమ మరెవరిపైనా లేదు. జై హింద్' అని క్యాప్షన్ పెట్టాడు.
టీమిండియా మహిళల టీం కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ట్విట్టర్లో పోస్టు పెట్టింది. 'దేశం నలుమూలల నుంచి ఏకమై మన అద్భుతమైన దేశంలో భారతీయులుగా ఉండటంలో ఉండే ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. మన త్రివర్ణ పతాకం ఎప్పుడూ ఉన్నతంగా ఎగురుతూనే ఉండాలని ఆశిస్తూ.. జై హింద్' అని పోస్టు చేసింది.
అలాగే లెజెండరీ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి కూడా సోషల్ మీడియాలో ఈ స్పెషల్ రోజు గురించి పోస్టు పెట్టింది. 'గతంలో కష్టాల నుంచి ప్రస్తుత అభివృద్ధి వరకు.. ఒక దేశంగా మన ప్రయాణాన్ని గౌరవిద్దాం. ఈ 77వ స్వతంత్ర దినోత్సవం నాడు మన మూలాలను గుర్తు చేసుకొని, అందమైన భవిష్యత్తుకు సంబంధించిన విత్తనాలను నాటదాం' అని పేర్కొంది.