
రోహిత్ మరో రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే తన కెరీర్లో కీలకమైన మైలురాయి చేరుకున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న అతను తన కెరీర్లో భారత్ తరఫున 17 వేల పరుగుల మైలురాయిని దాటాడు. అయితే ఈ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. వ్యక్తిగత స్కోరు 35 పరుగుల వద్ద అనవసరమైన షాట్కు యత్నించిన రోహిత్.. కునేమన్ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. లేదంటే బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్పై అతను మరో భారీ స్కోరు చేయడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు.

గిల్ తొలి టెస్టు శతకం..
ఇదేంటి? గతేడాది బంగ్లాదేశ్పై శుభ్మన్ గిల్ సెంచరీ చేశాడు కదా అనుకుంటున్నారా? ఇది భారత గడ్డపై గిల్కు మొదటి టెస్టు శతకం. స్వదేశంలో గిల్ రికార్డు అంత గొప్పగా ఏం లేదని విమర్శించిన వారందరి నోళ్లకూ గిల్ తన బ్యాటుతోనే తాళం వేశాడు. అద్భుతమైన బ్యాటింగ్, చూడచక్కని షాట్లతో 128 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత లియాన్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. కానీ అతని సెంచరీ చూసిన వాళ్లు మాత్రం ఫ్యూచర్లో ప్రపంచ క్రికెట్ను ఈ పంజాబ్ కుర్రాడు ఏలతాడని కితాబు ఇచ్చేస్తున్నారు.

విరాట్ మరో మైలురాయి..
అహ్మదాబాద్ టెస్టు మూడో రోజు ఆటలో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీనే. సుమారు ఏడాది తర్వాత అతను తొలిసారి హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది అతని కెరీర్లో 29వ టెస్టు హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అంతేకాదు, ఈ క్రమంలోనే స్వదేశంలో 4 వేల టెస్టు పరుగుల రికార్డును కూడా చేరుకున్నాడు. అక్కడితే కోహ్లీ రికార్డుల వేట ఆగలేదు. ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విండీస్ లెజెండ్ బ్రయాన్ లారాను కూడా దాటేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు.


Click it and Unblock the Notifications












